గులాబ్ ఖాన్ విడుదల: ఉగ్ర కేసుల్లో ముస్లింపై వివక్ష అంటూ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంబంధ కేసుల్లో ముస్లింలు వివక్షకు గురవుతున్నారని ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఉగ్రవాద సంబంధ కేసుల్లో ఆధారాలు లేకున్నా ముస్లింలను మొదట నిర్బంధిస్తున్నారని.. ఆ తర్వాత నిర్ధోషులుగా విడుదల చేస్తున్నారన్నారు.
రాంపూర్ సీఆర్పీఎఫ్ క్యాంపుపై 2008లో జరిగిన ఉగ్రదాడితో సంబంధం ఉందని అరెస్ట్ కాబడిన గులాబ్ ఖాన్.. తాజాగా నిర్ధోషిగా విడుదలవడంతో ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ముస్లింలు ఇలాంటి కేసుల్లో వివక్షకు గురవుతున్నారని ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాంపూర్ దాడి కేసులో గులాబ్ ఖాన్కే కాదు, బాధితులకు కూడా అన్యాయమే జరిగిందన్నారు.
Who were the real culprits? Will Gulab Khan be compensated for the indignity that he & his family had to endure?
— Asaduddin Owaisi (@asadowaisi) November 3, 2019
ఈ కేసులో 12 ఏళ్లుగా అవమాన భారాన్ని భరిస్తున్న గులాబ్ ఖాన్, అతని కుటుంబానికి పరిహారం ఇస్తారా? అని ప్రశ్నించారు. అలా అయితే, అసలు నిందితులు ఎవరని ఆయన నిలదీశారు.
రాంపూర్ సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రదాడి కేసులో దాదాపు 12ఏళ్లుగా బరేలీ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించిన గులాబ్ ఖాన్ గత శుక్రవారం రాంపూర్ కోర్టు నిర్ధోషిగా తేలడంతో విడుదలయ్యారు. అతడ్ని ఈ కేసులో నిందితుడిగా చేర్చడంతో ఈ శిక్షను అనుభవించాడు.
రాంపూర్ సీఆర్పీఎఫ్ క్యాంపుపై 2008లో జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు పారామిలిటరీ జవాన్లు, ఓ పౌరుడు మృతి చెందారు. ఈ కేసులో ఇద్దరు పాకిస్థాన్ జాతీయులతోపాటు ఆరుగురిని రాంపూర్ కోర్టు శిక్షదోషులుగా తేల్చింది. కాగా, ఈ దాడులకు ఉపయోగించిన ఆయుధాలను దాచారనే ఆరోపణలతో శిక్ష అనుభవించిన ముహమ్మద్ కౌసర్(ప్రతాప్గఢ్ వాసి), గులాబ్ ఖాన్(బరేలీ వాసి)లు నిర్ధోషులుగా విడుదలయ్యారు.