మిస్టరీ: అమెరికా వేటాడుతున్న నౌక హైజాక్...క్షేమంగా భారత్కు సెయిలర్లు, ఆ నాలుగు నెలలు?
ముంబై:ఇరాన్ పై అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘించి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆయిల్ ట్యాంకర్ జూలై 5న హైజాక్కు గురైంది. గత కొంతకాలంగా ఈ ఆయిల్ ట్యాంకర్ కోసం అమెరికా వేట కొనసాగిస్తోంది. యూఏఈ తీరంలో ఈ ఆయిల్ ట్యాంకర్ నౌక హైజాక్కు గురైందని సీఫేరర్స్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. మంగళవారం రోజున ఈ నౌక ఇరాన్ జలాల్లో కనిపించినట్లు ఉపగ్రహం ద్వారా తీసిన ఫోటోలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఆ నౌకలో ఏమి జరిగిందన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.
జాడ కనిపించని నౌక్ హైజాక్
అమెరికా ఇరాన్ దేశాల మధ్య గత కొన్ని నెలలుగా ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే గల్ఫ్ స్కై అనే నౌక అదృశ్యమైంది. కొన్ని నెలలుగా దీని జాడ కనిపించలేదు .అయితే జూలై 5న యూఏఈ తీరంలో ఈ నౌక ప్రత్యక్షమైంది. కానీ ఇది హైజాక్కు గురైనట్లు సమాచారం. అయితే నౌక హైజాక్ అయినట్లు స్వయంగా ఆ నౌక కెప్టెన్ తనకు నిర్థారణ చేసినట్లు యూకే మానవహక్కుల సీఈఓ డేవిడ్ హమండ్ తెలిపారు. ఇదిలా ఉంటే నౌకలో 26 మంది భారతీయ సెయిలర్లు ఉండగా వారంతా భారత్కు క్షేమంగా చేరినట్లు హమాండ్ చెప్పారు. మరో ఇద్దరు మాత్రం టెహ్రాన్లో చిక్కుకుపోయినట్లు స్పష్టం చేశారు.
ఇరాన్ జలాల్లో కనిపించిన నౌక
సముద్రంలో ఆయిల్ వాణిజ్యంకు సంబంధించిన విషయాలపై TankerTrackers.com అనే వెబ్సైట్ నిత్యం నిఘా ఉంచుతుంది. అయితే మంగళవారం రోజున ఉపగ్రహం అందించిన ఫోటోల ద్వారా కనిపించకుండా పోయిన నౌక ఇరాన్ సముద్రంలోని హర్మోజ్ ద్వీపం వద్ద కనిపించినట్లు ఆ వెబ్సైట్ పేర్కొంది. ఎంటీ నాటికాగా ఈ నౌక పేరు ఉన్న సమయంలో దీన్ని 12 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఇద్దరు ఇరానీయులు తెగ ప్రయత్నించారని చెబుతూ అమెరికా న్యాయశాఖ వీరిద్దరిపై క్రిమినల్ అభియోగాలు మోపింది. అంతేకాదు కొన్ని బడా కంపెనీల ద్వారా కొనుగోలుకు ప్రయత్నించినట్లు స్పష్టం చేసింది. ఇక ఆ తర్వాత ఇరాన్లోని ఖర్గ్ ద్వీపం నుంచి ఆయిల్ నింపుకుని ఇతర దేశాల్లో విక్రయించేందుకు నౌక బయలు దేరినట్లు అమెరికా ప్రభుత్వం ఆరోపణలు చేసింది.
జూలై 5న ఇంజిన్ ఆఫ్ అయినట్లు గుర్తింపు
అమెరికా అమలు చేసిన ఆంక్షలకు వ్యతిరేకంగా కొన్ని ఇరాన్ సంస్థలు ఈ నౌకకు సహకరించినట్లు కోర్టులో దాఖలు చేసిన డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. ఇక ఈ నౌకను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఇరాన్ పాస్పోర్టు కలిగి ఉన్నారని అమెరికా చెబుతోంది. ఇక ప్రస్తుతం ఎంటీ గల్ఫ్ స్కైగా పిలవబడుతున్న ఈ నౌకలోని ఆటోమేటిక్ ఐడెంటిఫికేష్న సిస్టం ట్రాకర్ ఇచ్చిన సమాచారం మేరకు జూలై 5న ఉదయం 4:30 గంటలకు ఇంజిన్ ఆఫ్ అయినట్లు తెలుస్తోందని షిప్ ట్రాకింగ్ వెబ్సైట్ MarineTraffic.com చెబుతోంది. సాధారణంగా నౌకలు తమ ఏఎస్ఐ ట్రాకర్స్ను ఆన్ చేసి ఉంచుకోవాలి. కానీ ఇరాన్కు వెళ్లే నౌకలు మాత్రం వాటి కదలికలు తెలియకుండా ఉండేందుకు ఆఫ్ చేస్తారు.
హర్మోజ్ జలసంధి ద్వారానే రవాణా
గతేడాదిగా అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయరాదని అమెరికా తన మిత్రదేశాలకు హుకూం జారీ చేసింది. అయితే ఇరాన్ నుంచి ఆయిల్ నిత్యం జలమార్గం ద్వారా రవాణా అవుతోంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాలకు సముద్రమార్గం ద్వారా ఆయిల్ను రవాణా చేయడంలో స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఇక్కడి నుంచే దాదాపు 20శాతం ఆయిల్ రవాణా జరుగుతోంది.