జమ్మూలో ఉగ్ర కలకలం: భవనంలో దాక్కున్న ఉగ్రవాదులు
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. సోమవారం పుల్వామా జిల్లాలోని పాంపోర్లోని ఓ ప్రభుత్వ భవనంలో ఉగ్రవాదులు దాక్కుని కాల్పులు జరిపారు. భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులకు దిగాయి. ఎదురు కాల్పల్లో భాగంగా సమీపంలోని ప్రజలను ఖాళీ చేయించారు.
కాగా ఈ భవనం జమ్మూకశ్మీర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్(జేకేఈడీఐ)కు చెందినదిగా అధికారులు గుర్తించారు. ఈ భవనంలో ముగ్గురు ఉగ్రవాదులు ఉండవచ్చని భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి. సోమవారం ఉదయం 6.30 గంటల కాల్పుల శబ్ధం వినిపిస్తోంది.
భవనంలో ముష్కరులు దాక్కున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు చుట్టుముట్టాయని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. భవనాన్ని చుట్టుముట్టిన భద్రతదళాలు, ముష్కరులను మట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. భవనాలను కాంక్రీట్ బంకర్లుగా ఉపయోగిస్తూ, భద్రతాబలగాలపై కాల్పులు జరపడం ఉగ్రవాదులకు ఈమధ్య కాలంలో పరిపాటిగా మారింది.
గతంలోఈ భవనంపై ఫిబ్రవరిలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన ఘటనలో ముగ్గురు పారామిలిటరీ కమెండోలతో పాటు ముగ్గురు ఆర్మీ జవాన్లు, ఒక సాధారణ పౌరుడు ఇలా మొత్తం ఏడుగురు మృతి చెందారు. రాజధాని శ్రీనగర్కు 10 కిలోమీటర్ల దూరంలో హైవేని ఆనుకుని ఈ భవనం ఉంది.