జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్: నెలరోజుల్లో రెండోసారి..!
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. కాశ్మీర్ ఉత్తర ప్రాంతంలో సమస్యాత్మక జిల్లాల్లో ఒకటైన బండీపొరలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. బండీపొర జిల్లాలోని గురేజ్ సెక్టార్ లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉందని తెలిపారు.
గురేజ్ సెక్టార్ లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి పక్కా సమాచారం అందినే నేపథ్యంలో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆర్మీ, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ), సీఆర్పీఎఫ్ జవాన్లు ఉమ్మడిగా కార్డన్ అండ్ సెర్చ్ ను చేపట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు.
దీనితో జవాన్లు ఎదురు కాల్పులు ఆరంభించారు. ప్రస్తుతం ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని, దీనికి సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉందని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ ద్వారా వెల్లడించారు.
#Encounter has started at #Bandipora. Further details shall follow. @JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) November 10, 2019
ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకోవడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. కిందటి నెల 15వ తేదీన అనంత్ నాగ్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అనంత్ నాగ్ లోని పజల్ పురాలో ఓ భవనంలో నక్కిన ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపిన ఘటనలో ముగ్గురు మరణించారు.
వారిని హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా నిర్ధారించారు. తాజాగా బండీపొర జిల్లాలో ఉగ్రవాదులు మకాం వేయడం ఆందోళనకు దారి తీస్తోంది. ఇలా ఇంకెంతమంది మాటు వేసి ఉన్నారనే విషయంపై ఆర్మీ అధికారులు ఇంటెలిజెన్స్ అధికారులను సంప్రదిస్తున్నారు.