సోన్భద్ర షూటౌట్: గ్రామ పెద్ద దాష్టీకం.. రైతులపై కాల్పులు! తాజా వీడియోతో కలకలం
లక్నో: ఉత్తర్ప్రదేశ్లో 10 మంది రైతులను పొట్టన పెట్టుకున్న సోన్భద్ర కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రభుత్వం మారినప్పటికీ.. ఉత్తర్ ప్రదేశ్లో అరాచకమే రాజ్యమేలుతోందనడానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. సోన్భద్ర జిల్లాలోని ఘొరావల్లో కిందటివారం చోటు చేసుకున్న హింసాకాండలో 10 మంది రైతులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఓ భూవివాదం సందర్భంగా చోటు చేసుకున్న ఈ ఘర్షణలో ఘొరావల్ గ్రామానికి చెందిన కొందరు పెద్దలు రైతులపై నాటు తుపాకులతో రైతులపై విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మంది రైతులు సంఘటనాస్థలంలోనే మరణించారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఈ ఘటన మొత్తానికీ ఆ గ్రామ పెద్ద యజ్ఞ దత్ ప్రధాన కారకుడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఘొరావల్ గ్రామ పెద్ద తుపాకీతో రైతులపై కాల్పులు చేపట్టడం ఈ వీడియోలో రికార్డయ్యింది. 32 ట్రాక్టర్లలో సుమారు 200 మందికి పైగా వచ్చిన వ్యక్తులు మూకుమ్మడిగా రైతులపై దాడి చేశారు. వారిని చావబాదారు. రైతులను చెల్లాచెదరు చేయడానికి అమానవీయంగా ప్రవర్తించారు. రైతులపై కర్రలతో దాడి చేయడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. రైతుల తలలను పగలగొట్టారు. కర్రలతో చావబాదారు. కిందపడ్డ వారిని కాళ్లతో తొక్కుతు, కర్రలతో చితగ్గొట్టడం ఈ వీడియోలో నిక్షిప్తమైంది. ఘొరావల్ గ్రామానికి చెందిన 36 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం అది.
ఆ మొత్తం భూమిని తమకు కేటాయించాలంటూ ఆ ఊరి పెద్ద సహా కొందరు రాజకీయ నాయకులు దళిత, గిరిజన రైతులపై కొంతకాలంగా ఒత్తిడిని తీసుకొస్తున్నారు. అయినప్పటికీ గ్రామ పెద్దలు పట్టించుకోలేదు. ఆ 36 ఎకరాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ నెల 17వ తేదీన పెద్ద ఎత్తున వారు రైతులను అడ్డుకున్నారు. పొలం పనులు చేసుకుంటున్న రైతులను బయటికి పంపించడానికి ప్రయత్నించారు. వారి దాష్టీకాన్ని రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఫలితంగా ఆగ్రహించిన గ్రామ పెద్దలు రైతులపై తుపాకులను గురి పెట్టారు. బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు.
ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరొకరు వారణాశిలోని బనారస్ హిందూ యూనివర్శిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాజకీయ రంగును పులుముకొన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంత ఇన్ఛార్జి ప్రియాంకా గాంధీ వాద్రా ఈ అంశంపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నడిరోడ్డుపై బైఠాయించి మరీ తన నిరసన వ్యక్తం చేశారు. ఘొరావల్ గ్రామానికి వెళ్లడానికి ఆమెకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా- ఆమె తన పోరాటాన్ని కొనసాగించి మరీ సంఘటనాస్థలంలో అడుగు పెట్టగలిగారు. బాధితులను, వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించగలిగారు.