జమ్మూకశ్మీర్ డీడీసీ ఎన్నికలు : గుప్కర్ అలయన్స్కే పట్టం కట్టిన ప్రజలు...
జమ్మూకశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా నేత్రుత్వంలోని గుప్కర్ అలయన్స్(పీఏజీడీ) ఘన విజయం దిశగా సాగుతోంది. ఇప్పటివరకూ అందిన ఫలితాల ప్రకారం మొత్తం 283 డీడీసీ(జిల్లా అభివృద్ధి మండళ్ల) స్థానాల్లో గుప్కర్ అలయన్స్ 115 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ కేవలం 70 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. అయితే మొత్తంగా జమ్మూకశ్మీర్లో బీజేపీనే అతిపెద్ద పార్టీగా అవతరించడం గమనార్హం.
కశ్మీర్ ప్రాంతంలో గుప్కర్ అలయన్స్కు ఎక్కువ సీట్లు రాగా జమ్మూ ప్రాంతంలో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. మొత్తంగా గుప్కర్ అలయన్స్లో జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్కు 56,పీడీపీకి 26,జమ్మూకశ్మీర్ పీపుల్ కాన్ఫరెన్స్కు 6,సీపీఐ(ఎం)కు 5 స్థానాలు దక్కాయి. ,కాంగ్రెస్ అభ్యర్థులు 21 స్థానాల్లో,ఇండిపెండెంట్లు 43 స్థానాల్లో విజయం సాధించారు. జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీకి 10,జేకేపీఎంకి 3,బీఎస్పీకి 1,పీడీఎఫ్కి ఒక స్థానం లభించాయి.
తాజా ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి,జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ... మొత్తం 20 జిల్లాల్లో కేవలం 5 జిల్లాల్లో మాత్రమే బీజేపీకి మెజారిటీ లభించిందన్నారు. 13 జిల్లాల్లో గుప్కర్ అలయన్స్ విజయం సాధించిందని అన్నారు. ఇక ఈ ఫలితాలతో సమీప భవిష్యత్తులో బీజేపీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోదన్నారు. కాబట్టి అసెంబ్లీ వెలుపల తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక అధికారాలను కల్పించే ఆర్టికల్ 370ని అగస్టు 5,2019న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి నేతలందరినీ ప్రభుత్వం నిర్బంధంలో ఉంచింది. సుదీర్ఘ కాల నిర్బంధం తర్వాత ఈ ఏడాది ఆ నేతలంతా ఎట్టకేలకు విడుదలయ్యారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా గుప్కర్ అలయన్స్ ఏర్పాటు చేశారు. నిజానికి గుప్కర్ అలయన్స్ నేతలు పెద్దగా ప్రచారం కూడా నిర్వహించలేదు. భద్రతా కారణాలతో అధికారులు తమను ప్రచారం చేయనివ్వలేదని అలయన్స్ నేతలు ఆరోపించారు. అయినప్పటికీ ఫలితాల్లో గుప్కర్ అలయన్స్కే ప్రజలు పట్టం కట్టడం గమనార్హం.