కారుతో ఢీకొట్టి, ఆరు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి...
గురుగ్రామ్ : గురుగ్రామ్లో ఒక దుర్మార్గుడు రెచ్చిపోయాడు. టోల్ టాక్స్ కట్టమన్న పాపానికి ఉద్యోగికి నరకం చూపించాడు. బాధితున్ని తన వాహనంతో ఢీకొట్టి, కారు బానెట్పై పడిన ఉద్యోగిని దాదాపు ఆరు కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. గురుగ్రామ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గురుగ్రామ్లోని టోల్ ప్లాజా వద్దకు ఇన్నోవాలో వచ్చిన నలుగురు వ్యక్తులు గేటు దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇది గ్రహించి అక్కడ పనిచేసే ఉద్యోగి అశోక్ ఎదురుగా వచ్చి కారు ఆపమని కోరాడు. దీంతో తన వాహనాన్ని పోలీసులు కూడా అడ్డుకోరని, అలాంటిది నువ్వెలా ఆపుతావంటూ డ్రైవర్ ఆగ్రహించాడు. కారుతో అశోక్ను ఢీ కొట్టాడు. దీంతో బాధితుడు కారు బానెట్పై పడిపోయాడు. అయినా కారును ఆపని ఆ దుర్మార్గుడు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ముందుకు పోనిచ్చాడు. బానెట్పై పడిన ఉద్యోగి భయంతో కారు వైపర్లను పట్టుకుని ఉండిపోయాడు.
అయ్యో పాపం: 30 మందిని కాపాడిన శునకం...కానీ దాన్ని మరిచిన జనం
దాదాపు ఆరు కిలోమీటర్ల ప్రయాణించిన తర్వాత కారును మానేసర్ ప్రాంతంలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన డ్రైవర్, టోల్ ప్లాజా ఉద్యోగి అశోక్పై దాడి చేశాడు. ఈ విషయం గురించి పోలీసులకు కంప్లైంట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కారు సీజ్ చేయడంతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.