పట్టపగలు.. అదీ మెట్రో స్టేషన్లో.. మహిళపై ఆటో డ్రైవర్ దారుణం
గుర్గావ్ : దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న నడిరోడ్డుపైనే ఓ మహిళను ప్రేమోన్మాది హత్య చేయగా.. తాజాగా మరో మహిళపై మెట్రో స్టేషన్ లోనే దాడికి తెగబడ్డాడో దుర్మార్గుడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే.. 30సార్లు ఆమెను కత్తితో కసితీరా పొడిచి చంపేశాడు.
గుర్గావ్ లోని ఎంజీరోడ్ మెట్రో స్టేషన్ లో సోమవారం నాడు ఈ దారుణం చోటు చేసుకుంది. హత్య చేయబడ్డ మహిళను పింకీ దేవి(34)గా గుర్తించారు. ఆమె స్థానిక బ్యూటీ పార్లర్ లో పనిచేస్తోంది. కాగా, ఈ దారుణానికి ఒడిగట్టిన జితేందర్(26) అనే ఆటో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతకొంతకాలంగా పింకీ దేవిని జితేందర్ వేధిస్తున్నట్లుగా మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
హత్యానంతరం తప్పించుకోవడానికి యత్నించిన జితేందర్ ను ఓ ఎలక్ట్రిక్ స్టాండింగ్ ఫ్యాన్ విసిరి పట్టుకున్నారు. హత్య సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించినవారిని కత్తితో బెదిరించాడు నిందితుడు. హత్యానంతరం మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించగా.. ఆమె శరీరంపై 30కత్తి పోట్లు ఉన్నట్లుగా వైద్యులు నిర్దారించారు.
ఇదిలా ఉంటే, షిల్లాంగ్ కు చెందిన పింకీ దేవి భర్త మాన్ సింగ్ తో కలిసి గుర్గావ్ లోని సార్ హాల్ గ్రామంలో నివసిస్తోంది. మూడేళ్ల క్రితం వీరిద్దరికి వివాహం జరిగినట్లుగా సమాచారం. ఇక జితేందర్ స్థానిక రాజీవ్ నగర్ లో ఉంటూ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. పింకీ దేవిపై వేధింపులకు దిగినట్లుగా అతనిపై ఆరోపణలున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం జితేందర్ నుంచి నిజాలు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు.