అక్కడ పీల్చేది గాలి కాదు.. కాలకూట విషం: లాహోర్ కంటే ఘోరం గుర్ గావ్:
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా హర్యానాలోని గుర్ గావ్ అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్తాన్ లోని లాహోర్, చైనాలోని హోటన్ నగరాల కంటే దారుణ పరిస్థితి గుర్ గావ్ లో నెలకొని ఉన్నట్లు ఐక్యూ ఎయిర్ విజువల్స్, గ్రీన్ పీస్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే నివేదికను ఆ సంస్థలు మంగళవారం వెల్లడించాయి.
అత్యంత కాలుష్య నగరాల జాబితాలో టాప్ టెన్ లో ఏడు మనదేశానికి చెందినవే కావడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. గుర్ గావ్ అగ్రస్థానంలో నిలవగా, ఘజియాబాద్, ఫరీదాబాద్, భివడీ, నోయిడా, పట్నా, లక్నో తొలి 10 నగరాల జాబితాలో చేరాయి. చైనాలోని హోటన్, పాకిస్తాన్ లోని లాహోర్, ఫైసలాబాద్ లు టాప్ టెన్ లో ఉన్నాయి. అత్యంత కాలుష్య నగరంగా ఇదివరకే గుర్తింపు పొందిన దేశ రాజధాని న్యూఢిల్లీ పరిస్థితి కాస్త మెరుగుపడింది. హస్తిన.. ఈ జాబితాలో 11 స్థానంలో నిలిచింది. జోధ్ పూర్, ముజప్ఫర్ పూర్, వారణాశి, మొరాదాబాద్, ఆగ్రా, గయ, జింద్ నగరాలు 20 లోపు స్థానాల్లో నిలిచాయి.
కాలుష్యం ఇలా అడ్డు, అదుపు లేకుండా పెరిగిపోవడం వల్ల అనేక ప్రాణాంతక వ్యాధులు ముసురుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయ కేన్సర్, గుండెపోటు, అస్థమా వంటి రోగాలు.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కర్నీ కబళిస్తాయని అంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత 20 కాలుష్య నగరాల్లో 15 భారత్ లోనివే. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో చైనా రాజధాని బీజింగ్ 122వ స్ధానంలో నిలిచింది.