డేరా బాబా కేసు: ‘నేను నపుంసకుడిని’.., ‘మరి పిల్లలెలా పుట్టారు?’ కోర్టులో ఆసక్తికర సంభాషణ
సాధ్వీలపై అత్యాచారం కేసు నుంచి ఎలాగైనా బయటపడాలని చూసిన డేరా బాబా తనను తాను నపుంసకుడిగా కూడా చెప్పుకున్నాడట. కోర్టులో వాదనల సమయంలో చోటుచేసుకున్న ఈ ఆసక్తికర విషయం తాజాగా వెల్లడైంది.
రోహ్తక్: సాధ్వీలపై అత్యాచారం కేసు నుంచి ఎలాగైనా బయటపడాలని చూసిన డేరా బాబా తనను తాను నపుంసకుడిగా కూడా చెప్పుకున్నాడట. కోర్టులో వాదనల సమయంలో చోటుచేసుకున్న ఈ ఆసక్తికర విషయం తాజాగా వెల్లడైంది.
1990 నుంచి తనకు లైంగిక సామర్థ్యం లేదని, తాను శృంగారానికి పనికి రానని సీబీఐ కోర్టు జడ్జి జగ్దీప్ సింగ్ ముందు తన వాదన వినిపించాడు గుర్మీత్. అలాంటి తాను.. ఈ రెండు రేప్లు ఎలా చేస్తానంటూ.. తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశాడు.
1999లో గుర్మీత్ ఈ రేప్లు చేసినట్లు ఆరోపణలు ఉండటంతో.. అతను 1990 నుంచే తనకు లైంగిక సామర్థ్యం లేదని చెప్పి తప్పించుకోవాలని చూశాడు. ఇదొక్క కారణం చాలు అతనిపై ఉన్న రేప్ కేసులు కొట్టేయడానికి అని గుర్మీత్ తరఫు లాయర్లు కూడా వాదించారు. పైగా ప్రాసిక్యూషన్ కూడా ఈ విషయంలో అతనికెప్పుడూ పరీక్షలు జరపలేదని వాళ్లు పేర్కొన్నారు.
అయితే ఇక్కడే న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ వేసిన ప్రశ్నకు గుర్మీత్ తెల్లమొహమేశాడు. ఈ కేసులో గుర్మీత్కు అనుకూలంగా సాక్ష్యం చెప్పిన వారిలో ఒక వ్యక్తి.. గుర్మీత్ కు ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు కూడా చెప్పాడు. ఇదే విషయాన్ని న్యాయమూర్తి లేవనెత్తారు.
హాస్టల్ వార్డెన్లలో ఒకరు గుర్మీత్కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, వాళ్లు కూడా డేరా హాస్టల్లోనే ఉంటున్నారని చెప్పిన విషయాన్ని జడ్జి గుర్తుచేశారు. దీంతో డేరాబాబా చెప్పింది అబద్ధమని న్యాయమూర్తి తేల్చేశారు.
రెండు రేప్ కేసుల్లో గుర్మీత్కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. తనను నమ్మిన భక్తులతోనే ఓ క్రూర మృగంలా వ్యవహరించిన గుర్మీత్పై ఏమాత్రం సానుభూతి చూపించేది లేదని కూడా జగ్దీప్ సింగ్ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు.