గుర్మీత్ కన్నీళ్లు!: తీర్పు విని షాక్, ఆ సమయంలో బాబా మానసిక స్థితి ఇదీ!
కొద్దిసేపు దాకా ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో పడిపోయారట.
పంచకుల: అత్యాచారం కేసులో కోర్టు దోషిగా తేల్చిన తర్వాత గుర్మీత్ మానసిక ప్రవర్తన ఎలా ఉందో చెప్పేలా ఓ ఆసక్తికర కథనం బయటకు వచ్చింది. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ తీర్పు వెలువరించిన వెంటనే డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ షాక్ కు గురయ్యారట. ఆ సమయంలో ఆయన కళ్లలో కన్నీటి సుడులు కనిపించాయని తెలుస్తోంది.
డేరా బాబాను 'దోషి'గా తేల్చిన జడ్జి ఈయనే; బాబా సంతానంలో ఆమె దర్శకురాలు..
కొద్దిసేపు అసలేం జరుగుతుందో నిర్దారించుకోలేనంత అయోమయ పరిస్థితిలో పడిపోయారట. జడ్జి తీర్పు వెలువరించిన వెంటనే.. గుర్మీత్ తరుపు న్యాయవాది తీర్పు వివరాలను ఆయనకు వెల్లడించారట. ఆయన మాటలు వినగానే గుర్మీత్ దిగ్భ్రాంతికి గురైనట్లు చెబుతున్నారు.
దిమ్మతిరిగే ఆస్తుల చిట్టా: డేరా బాబా వెనుక వేల కోట్లు.. ఒక్కడికే 100లగ్జరీ కార్లు!
షాకింగ్ లోనే కొద్దిసేపు:
తీర్పు తర్వాత చెమ్మగిల్లిన కళ్లతో కొద్దిసేపటి వరకు ఆయన అయోమయ స్థితి నుంచి బయటకు రాలేకపోయారని సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హెచ్పీఎస్ వర్మ తెలిపారు. ఇద్దరు సీబీఐ అధికారులు, ఒక ఐజీపీ ర్యాంకు అధికారి, ఒక సీబీఐ న్యాయవాది, డిఫెన్స్ న్యాయవాదితో కలిసి అరగంట సేపు కోర్టు హాలులోనే ఉన్నారు.
తీర్పు అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్కార్పియో వాహనం వద్దకు తీసుకెళ్లారు. అదే క్రమంలో ప్రత్యేకంగా అమర్చిన కెమెరా ముందుకు వెళ్లి.. తన అనుచరులందరికి ప్రశాంతంగా ఉండాలన్న సూచన చేయాలని గుర్మీత్ ను పోలీసులు కోరారు. ఆపై ఆయన వెంట సిర్సా నుంచి తరలి వచ్చిన వందలకొద్ది వాహనాలను వెనక్కి వెళ్లాల్సిందిగా ఆదేశించారు.
హెలికాప్టర్లో తరలింపు:
పంచకుల కోర్టు నుంచి హెలికాప్టర్ ద్వారా గుర్మీత్ ను రోహ్ తక్ జైలుకు తరలించారు. సహజంగా పంచకుల కోర్టు తీర్పు చెప్పినప్పుడు దోషులను అంబాలా సెంట్రల్ జైలుకు తీసుకెళ్లతారు. అయితే అంబాలా వద్ద గుర్మీత్ అనుచరులు భారీ ఎత్తున గుమిగూడటంతో.. అధికారులు అక్కడికి తీసుకెళ్లలేదు. రోహ్ తక్ ప్రాంతంలో డేరా ఎఫెక్ట్ పెద్దగా లేకపోవడంతో.. అక్కడ ఆయన అభిమానులెవరూ అడ్డుపడలేదు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా:
ఈ నెల 28న న్యాయస్థానం గుర్మీత్కు శిక్ష ఖరారు చేయనుంది. రేప్ కేసులో 7ఏళ్ల వరకు ఆయనకు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే భద్రతా కారణాల రీత్యా కోర్టు శిక్ష విధించే రోజు గుర్మీత్ ను పంచకుల తీసుకెళ్లడం లేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఆయన కోర్టు విచారణలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేశారు.
రెండు ఆశ్రమాలకు సీజ్:
డేరా బాబాను దోషిగా తేల్చడంతో పంజాబ్, హర్యానాల్లో తీవ్రమైన హింస చెలరేగిన సంగతి తెలిసిందే. భారీ ఆస్తి నష్టంతో పాటు దాదాపు 32మంది దాకా ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డేరా సంస్థకు చెందిన 2 ఆశ్రమాలను అధికారులు సీజ్ చేశారు.
తాజాగా సిర్సాలో ఓ వ్యక్తి గాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మీరట్లో ఇంకా హైఅలర్ట్ కొనసాగుతోంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో 340 రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది.
కాగా, పంచకుల జిల్లాలో పరిస్థితి అదుపు తప్పినప్పటికీ.. హర్యానా పోలీసులు అదుపు చేయగలిగారని డీజీపీ బీఎస్ సంధు తెలిపారు. సీబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించగనే డేరా బాబా అనుచరులు రెచ్చిపోయి పలు కార్లు, బస్సులను ధ్వంసం చేసారు. సెక్యూరిటీ బారియర్లను కూలదోసి మీడియా బృందంపై, ఓబీ వ్యాన్లపై దాడి చేసారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేశారు.