ఉద్యోగం పోయిందని..అయిదంతస్తుల భవనం అంచుల్లో నిల్చుని!
గుర్గావ్: తమ డిమాండ్లను సాధించుకోవడానికి ఎవరైనా సెల్ టవర్ ఎక్కుతారు. గంటల కొద్దీ అక్కడే తిష్ఠ వేస్తారు. తగిన హామీ లభించిన తరువాత.. తీరిగ్గా కిందికి దిగొస్తారు. హర్యానాలోని గుర్గావ్లో మాత్రం ఓ యువతి ఈ ట్రెండ్ను బ్రేక్ చేశారు. ఏకంగా అయిదంతస్తుల భవనం మీదికి ఎక్కి, పిట్టగోడ మీద నిల్చుని మరీ ఆందోళన చేశారు. తన పంతాన్ని నెరవేర్చుకున్నారు.
ఉద్యోగం పోయిందనే అక్కసుతో ఓ యువతి ఆందోళనకు దిగారు. తాను పనిచేస్తోన్న కార్యాలయానికి చెందిన అయిదంతస్తుల భవనం పైకి ఎక్కి.. అంచుల్లో నిల్చుని మరీ ధర్నా చేశారు. తనను ఉద్యోగంలో కొనసాగించకపోతే.. దూకి ఛస్తానంటూ బెదిరించారు. ఆమె బెదిరింపులకు దిగొచ్చిందా సంస్థ యాజమాన్యం. ఆమెను మళ్లీ విధుల్లోకి తీసుకోవడానికి అంగీకరించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
ఆ యువతి పేరు తెలియరావట్లేదు. గుర్గావ్ సైబర్ సిటీలోని ఓ బహుళజాతి సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో సదరు సంస్థ యాజమాన్యం ఆమెకు నోటిసులు ఇచ్చింది. నెలరోజుల్లో రాజీనామా చేయాలని ఆదేశించింది. దీనితో ఆమె ఆగ్రహానికి గురయ్యారు. తన తప్పు లేకపోయినప్పటికీ.. తనను బాధ్యురాలిని చేయడంపై ఆవేదనకు గురయ్యారు.
వెంటనే తన కార్యాలయం కొనసాగుతున్న అయిదంతస్తుల భవనం పైన, పిట్టగోడ ఎక్కి అంచుల్లో నిల్చున్నారు. తనను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోకపోతే.. దూకి ఛస్తానంటూ బెదిరించారు. ఈ విషయం తెలిసిన వెంటనే- తోటి ఉద్యోగులు, సంస్థ యాజమాన్యం టెర్రస్ పైకి చేరుకున్నారు. ఆమెను బుజ్జగించి, కిందికి దించారు. ఉద్యోగంలో కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. దీనితో ఈ కథ సుఖాంతమైంది.