చిక్కుల్లో శ్రీనివాసన్: మేయప్పన్పై హస్సీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొత్తం వ్యవహారాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ అల్లుడు గుర్నాథ్ మాయప్పన్ చూసేవాడని ఆ జట్టు ఆటగాడు మైకేల్ హస్సీ స్పష్టం చేశాడు. హస్సీ వ్యాఖ్యలు యజమాని శ్రీనివాసన్కు మరిన్ని చిక్కులు తెచ్చే అవకాశం లేకపోలేదు. అయితే గుర్నాథ్ మాయప్పన్కు క్రికెట్ అంటే ఇష్టం కారణంగానే జట్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడని గతంలో శ్రీనివాసన్ చెప్పడం గమనార్హం.
కాగా బిసిసిఐ అధ్యక్షుడు, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ చెన్నై సూపర్ కింగ్స్ నియంత్రణాధికారాలను గుర్నాథ్ మాయప్పన్కు అప్పగించారని తన పుస్తకం ‘అండర్నీత్ ది సౌతర్న్ క్రాస్'లో మైకేల్ హస్సీ పేర్కొనడం జరిగింది. శ్రీనివాసన్ నిర్ణయం మేరకు గుర్నాథ్ మాయప్పన్ కోచ్ కెప్లర్ వెస్సెల్స్తో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును నడిపిస్తున్నారని మైకేల్ తన పుస్తకంలో తెలియజేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-6 స్పాట్ ఫిక్సింగ్ కేసులో అప్పుడు చెన్నై జట్టుకు ప్రిన్సిపాల్గా ఉన్న గుర్నాథ్ మాయప్పన్తోపాటు 21మందిపై అవకతవకలు, మోసం, కుట్రలు చేసినట్లు ఛార్జీ షీటు దాఖలు చేయడం జరిగింది. మాయప్పన్ తన జట్టుకు సంబంధించిన సమాచారాన్ని బయటికి లీక్ చేయడంతోపాటు బెట్టింగ్కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
మాయప్పన్ పై ఆరోపణలు రావడంతో చెన్నై జట్టు యజమాని, బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అతనికి దూరంగా ఉండడం ప్రారంభించాడు. కాగా గత మే నెలలో మాయప్పన్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వారు దాఖలు చేసిన ఛార్జీ షీటులో అతని పేరును చేర్చారు. మాయప్పన్ కంటే ముందు చెన్నై జట్టు వ్యవహారాలను చూసుకుంటున్న మరో వ్యక్తి కూడా స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు సమాచారం.
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల అనంతరం బిసిసిఐ ఇద్దరు సభ్యులతో కూడిన పరిశీలన బృందం చెన్నై జట్టు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని క్లియరెన్స్ ఇచ్చింది. కానీ బీహార్ క్రికెట్ అసోసియేషన్ ఈ విషయంలో కోర్టును ఆశ్రయించింది. కాగా బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాసన్ ఐపిఎల్, స్పాట్ ఫిక్సింగ్కు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోరాదని సోమవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. తర్వాతి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది.