రేప్ చేస్తాం అంటూ బెదిరింపు ఫోన్లుః ఆ వెంటనే అదృశ్యంః మహిళా టీచర్ ఏమైనట్టు?
గువాహటిః జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో జైషె మహమ్మద్ ఉగ్రవాదులు మారణహోమంపై వివాదాస్పద వ్యాఖ్యానాలు చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు అదృశ్యం అయ్యారు. 48 గంటలుగా ఆమె కనిపించకుండా పోయారు. ఆదివారం నుంచి ఆమె జాడ దొరకట్లేదు. వివాదాస్పద వ్యాఖ్యనాల తరువాత ఆమెకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెకు ఫోన్ కాల్ చేసి బెదిరించారు. అత్యాచారం చేస్తామని, హతమారుస్తామనీ బెదిరింపులు ఫోన్లు వచ్చాయి. ఆ తరువాత ఆమె జాడ తెలియరాలేదు. దీనిపై అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
ఆమె పేరు పాప్రి జెడ్ బెనర్జీ. గువాహటిలోని ఐకన్ అకాడమీ ఆఫ్ కామర్స్ కళాశాలలో ఉపాధ్యాయురాలు. పుల్వామాపై ఉగ్రవాదుల దాడి తరువాత ఆమె వివాదాస్పద వ్యాఖ్యానాలు చేశారు. ఉగ్రవాదులు దాడి చేయడం సరికాదని అంటూనే పాప్రి.. జవాన్లు అనేక దురాగతాలకు పాల్పడ్డారని అన్నారు. ఉగ్రవాదుల అన్వేషణ పేరుతో జవాన్లు అత్యాచారాలకు తెగబడ్డారని విమర్శించారు. మహిళలు , పిల్లలపై దాడులు చేశారని చెప్పారు. వాటన్నింటి ఫలితమే ఈ దాడులని చెప్పారు. తప్పు చేశారు గనకే హతమయ్యారని పాప్రి తన వ్యాఖ్యానాల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఓ పోస్ట్ ను ఆమె శనివారం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఈ వ్యాఖ్యానాలను తీవ్రంగా పరిగణించిన అకాడమీ యాజమాన్యం ఆమెను సస్పెండ్ చేసింది.
ఆ వెంటనే ఆమెకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్లు వచ్చాయి. దీనిపై ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రేపు అనేది ఉంటుందో, లేదో తనకు తెలియదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు జరగరానిది ఏదైనా జరిగితే దానికి అసోం పోలీసులే బాధ్యత వహించాలని కూడా అన్నారు. విపరీతమైన ఫోన్కాల్స్, ఇమెయిళ్లు అందుతున్నాయని అన్నారు. శనివారం ఆమె స్థానిక చాంద్మరి పోలీస్స్టేషన్ వెళ్లారు. ఆదివారం కూడా రావాల్సి ఉంటుందని పోలీసులు పాప్రికి సమాచారం ఇచ్చారు. అదే రోజు నుంచి ఆమె కనిపించకుండా పోయారు. పాప్రి ఇంట్లో లేరని, ఆమె ఫోన్ నంబర్ స్విచాఫ్ వస్తోందని ఆమె తండ్రి, సోదరుడు అదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారిద్దరితో కలిసి కొన్నేళ్లుగా గువాహటిలోని గాంధీ బస్తీలో నివసిస్తున్నారు.