హెచ్-1బి వీసా బిల్లు సెగ: 4 ప్రధాన ఐటి కంపెనీలు విలవిల, 21,000 కోట్ల సంపద ఆవిరి
అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశపెట్టిన హెచ్-1బి వీసా బిల్లు సెగ భారత స్టాక్ మార్కెట్లకు తగిలింది. శుక్రవారం నాడు ఆరంభంలో లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి.
ముంబై: అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశపెట్టిన హెచ్-1బి వీసా బిల్లు సెగ భారత స్టాక్ మార్కెట్లకు తగిలింది. శుక్రవారం నాడు ఆరంభంలో లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు ఈ బిల్లు మూలంగా క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి.
ప్రధానంగా టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ షేర్లు కుదేలయ్యాయి. ఈ నాలుగు కంపెనీలకు చెందిన 21,000 కోట్ల రూపాయల సంపద కేవలం కొద్ది గంటల్లోనే ఆవిరైపోయింది.
హెచ్-1బి వీసా బిల్లు గనుక అమెరికా కాంగ్రెస్ లో పాస్ అయితే.. భారతీయ ఐటి కంపెనీల పని అయిపోయినట్లే అనే వదంతులు ప్రభావం కారణంగా పలు ఐటి కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి.
టెక్ మహీంద్రాతోపాటు ఇతర ఐటి కంపెనీల షేర్లు కూడా విలవిలలాడాయి. బీఎస్ఈలో ఐటి సబ్ ఇండెక్స్ దాదాపు 3 శాతం మేర క్షీణించింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చంజ్ లోనూ ఐటి రంగం భారీ స్థాయిలో పతనమైంది.
ఇతర సెక్టార్లతోపాటు ఐటి, టెక్నాలజీ రంగ షేర్ల నష్టాలు మార్కెట్లను బాగా ప్రభావితం చేస్తున్నాయి. ఆరంభంలో 100 పాయింట్లకు పైగా ఎగసిన సెన్సెక్స్ ఆ తరువాత కొద్ది గంటల్లోనే 31 పాయింట్లు పతనమైంది.
టెక్ మహీంద్రా, మైండ్ ట్రీ, హెచ్ సి ఎల్ టెక్నాలజీస్, టిసిఎస్, ఇన్ఫోసిస్, ఒరాకిల్, కేపీఐటి, విప్రో లాంటి ఫ్రంట్ లైన్ ఐటి షేర్లు 4-5 శాతం పతనమవగా, ఇతర కంపెనీల షేర్లు కూడా ఆ బాటలోనే పయనిస్తున్నాయి.
న్యూక్లియస్, సొనాటా సాఫ్ట్ వేర్, రామ్ కో సిస్టమ్స్, హెక్సావేర్, ఆప్టెక్, ఆర్ఎస్ సాఫ్ట్ వేర్, నిట్ టెక్, జామెట్రిక్ తదితర కంపెనీల షేర్లు కూడా దిగజారాయి. దీంతో ఒక దశలో సెన్సెక్స్ 6 శాతం, నిఫ్టీ 0.07 శాతం నష్టాలతో కొనసాగుతోంది.
"ఐటి కంపెనీల షేర్లు ఇంతలా పతనం కావడానికి హెచ్-1బి వీసా బిల్లు ప్రధాన కారణం. ఈ బిల్లు గనుక ఆమోదం పొంది చట్టరూపం దాల్చితే.. 150 బేసిస్ పాయింట్ల మేర ఐటి కంపెనీల ఇబిఐటిడిఎ మార్జిన్లు తగ్గుతాయి. ." అని ఐడిబిఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్ రీసర్చ్ హెడ్ ఎ.కె.ప్రభాకర్ వ్యాఖ్యానించారు.