కన్నడనాట మళ్లీ ట్విస్ట్లు:నేను చూసుకుంటా..కాంగ్రెస్ శివకుమార్కు సీఎం, అవిశ్వాసానికి బీజేపీ ప్లాన్!
బెంగళూరు: కర్ణాటకలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రయత్నాలు చేస్తోందన్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామి సోమవారం కొట్టి పారేశారు. తమ పార్టీ నుంచి లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి ఎవరూ వెళ్లరని చెప్పారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టలేరన్నారు. ఎమ్మెల్యేలు ఎవరు కూడా బీజేపీలో చేరరని చెప్పారు. ఆపరేషన్ లోటస్ను ఆయన కొట్టి పారేశారు.
ఆపరేషన్ లోటస్ అంటూ ప్రచారం జరుగుతోందని, ఈ రోజు కూడా మీడియాలో తాను ఓ వార్త చూశానని, జనవరి 17వ తేదీన కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధిస్తారని ప్రచారం జరుగుతోందని, కానీ ఇలాంటి ప్రచారం (తప్పుడు ప్రచారం) ఎందుకు జరుగుతుందోనని, మీడియాకు ఇలాంటి అవాస్తవ కథనాలు ఎలా వస్తున్నాయని, ఇలాంటివి చూసి తనకు ఆశ్చర్యం కలుగుతోందన్నారు.
ఈ తప్పుడు ప్రచారం వల్ల ఎవరికి లాభమో నాకు అర్థం కావట్లేదు
ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల ఎవరికి లాభం కలుగుతుందో తనకు అర్థం కావడం లేదని కుమారస్వామి అన్నారు. కానీ ఇలాంటి వాటి వల్ల కర్ణాటక రాష్ట్ర ప్రజలు నష్టపోతారని చెప్పారు. అదే సమయంలో కాంగ్రెస్ నేత, మంత్రి శివకుమార్కు కూడా కుమారస్వామి కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారని, బీజేపీ ఆపరేషన్ లోటస్ను తెరపైకి తెచ్చిందని శివకుమార్ అభిప్రాయపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడారు.
నేను హ్యాండిల్ చేయగలను
ఆ ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని కుమారస్వామి అన్నారు. వారు తనకు చెప్పిన తర్వాతనే ముంబైకి వెళ్లారని చెప్పారు. తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పు ఏమీ లేదని చెప్పారు. బీజేపీ నేతలు ఎవరిని సంప్రదిస్తున్నారో తనకు తెలుసునని, నేను దీనిని హ్యాండిల్ చేయగలనని చెప్పారు. ఒక విధంగా నేను చూసుకుంటానులే అన్నట్లుగా చెప్పారు.
అవిశ్వాసం పెట్టే ఛాన్స్
మరోవైపు, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పదిమంది, జేడీఎస్కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారనే ప్రచారం కలకలం రేపుతోంది. జేడీఎస్ - కాంగ్రెస్ ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉందని తెలుస్తోంది.
ఆసక్తికరంగా కన్నడ రాజకీయాలు
కాగా, కర్ణాటక రాజకీయాలు మళ్లీ ఆసక్తికరంగా మారాయి. తమ పార్టీకి చెందిన 102 మంది ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హర్యానా రిసార్టుకు తరలించింది. ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించాలని బీజేపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేయడంతో దానిని అమలు చేశారు. బీజేపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ చెప్పింది. అయిదుగురు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పింది. కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వానికి తగిన బలం ఉందని పేర్కొంది. అయినప్పటికీ బీజేపీ నేతలు టచ్లో ఉన్నారని తెలిపింది. దీనిని బీజేపీ కొట్టిపారేసింది. అదే సమయంలో బీజేపీ... తమతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పింది. అలాగే, జేడీఎస్ నుంచి కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపింది.