దేశానికి స్వాతంత్య్రం వచ్చేది కాదు: బెంగాల్ వల్లే: మమత: ఎన్సీసీ తరహాలో జైహింద్ వాహిణి
కోల్కత: ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంత్యుత్సవాలను ఇవ్వాళ దేశం మొత్తం ఘనంగా జరుపుకొంటోంది. ఆయన చేసిన అసమాన పోరాటాన్ని స్మరించుకుంటోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు నివాళి అర్పించారు
బాలయ్యకు థ్యాంక్స్ చెప్పిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు: ఆ వీడియో క్లిప్తో కలిపి
కోల్కతలో ఘనంగా
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేతాజీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా- ఆయన స్వరాష్ట్రం పశ్చిమ బెంగాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. సుభాష్ చంద్రబోస్ 125వ జయంత్యుత్సవాలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. కోల్కతలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మమత బెనర్జీ పాల్గొన్నారు. పలువురు మంత్రులు, అధికారులు దీనికి హాజరయ్యారు. మాయో రోడ్లోని నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
మమత బెనర్జీ కీలక వ్యాఖ్యలు..
అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమత బెనర్జీ.. కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ వల్లే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని అన్నారు. బెంగాల్ లేకపోయి ఉంటే స్వాతంత్య్రం వచ్చి ఉండేది కాదని చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో బెంగాలీలు కీలక పాత్ర పోషించారని, దిశానిర్దేశం చేశారని అన్నారు. ఈ వాస్తవం పట్ల తాను గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు మీద స్పోర్ట్స్ యూనివర్శిటీ నెలకొల్పుతామని ప్రకటించారు.
జాతీయ సెలవు దినంగా ప్రకటించండి..
నేతాజీ జయంతి రోజైన జనవరి 23వ తేదీని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా తక్షణ చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్క పౌరుడు కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ను స్మరించుకోవాలని, ఆయనకు ఘనంగా నివాళి అర్పించాలని అన్నారు. ఆయన చేసిన అసమాన పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని పేర్కొన్నారు.
ఎన్సీసీ తరహాలో జైహింద్ వాహిణి..
ఢిల్లీలో సుభాష్ చంద్రబోస్ కోసం ఓ ప్లానింగ్ కమిషన్ ఉండేదని, దాన్ని మోడీ సర్కార్ రద్దు చేసిందని అన్నారు. అదే కమిషన్ను తాము రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) తరహాలో ప్రత్యేకంగా జైహింద్ వాహిణిని ఏర్పాటు చేస్తామని మమత బెనర్జీ వెల్లడించారు. ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలలోనూ జైహింద్ వాహిణిని నెలకొల్పుతామని, దీనికి అవసరమైన చర్యలను ఇదివరకే తీసుకున్నామని పేర్కొన్నారు.
రాజకీయాలు తగవు..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల వల్ల దీని ఏర్పాటులో జాప్యం చోటు చేసుకుందని మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. అమర వీరుల స్మారక కేంద్రాన్ని నెలకొల్పే విషయంలో కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తోన్నాయని ఆమె పరోక్షంగా భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి విమర్శించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి విషయంలో రాజకీయాలు తగవని అన్నారు. రాజకీయాలకు అతీతంగా నేతాజీని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని మమత బెనర్జీ వ్యాఖ్యానించారు.