‘నిర్భయ నా కూతురైతే.. నిందితుల్ని కాల్చేసేవాడ్ని’
న్యూఢిల్లీ: ఢిల్లీ గ్యాంగ్రేప్ బాధితురాలు నిర్భయ స్థానంలో ఒకవేళ తన కూతురు కనుక ఉండి ఉంటే.. నిందితులను అప్పుడే కాల్చి చంపేవాడినని తృణముల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఒబ్రెయిన్ తీవ్రంగా స్పందించారు.
రాజ్యసభలో జువెనైల్ చట్టసవరణ బిల్లు చర్చ సందర్భంగా తృణముల్ పార్టీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ మాట్లాడుతూ.. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు సమస్యపై రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. జువెనైల్ చట్ట సవరణ బిల్లుకు తృణామూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపుతోందని చెప్పారు.
దేశ ప్రజలు కోరుకుంటున్న బిల్లుకు ఎంపీలు అందరూ సహకరించాలన్నారు. ఓ ఆదర్శ బిల్లును ఆమోదింప చేసుకునేందుకు ఎందుకు ఇంత కాలం ఎదురుచూడాలన్నారు. జువెనైల్ జస్టిస్ బిల్లును మరింత పటిష్టం చేసేందుకు అందరూ ఒక్కటికావాలన్నారు. బాల నేరస్థుల శిక్ష కాలాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
రిమాండ్ కేంద్రాల పరిస్థితిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలన్నారు. జైలు నుంచి విడుదలైన జువెనైల్ నేరస్థులకు ప్రభుత్వం ఆర్థిక, మానసిక, విద్యా మద్దతు కల్పించాల్సిన అవసరం ఉందని డెరిక్ ఒబ్రెయిన్ అన్నారు.