ట్రంప్-మోడీ వల్లే నా అరెస్ట్: హఫీజ్ సయీద్ ఉక్కిరిబిక్కిరి, భారత్ ఘాటుగా..
ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ తన హౌస్ అరెస్ట్ పైన స్పందించాడు.దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కారణమని అంటున్నాడు.
ముంబై: ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ తన హౌస్ అరెస్ట్ పైన స్పందించాడు.దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కారణమని అంటున్నాడు.
సోమవారం రాత్రి తనను గృహ నిర్బంధంలో ఉంచడంపై మాట్లాడాడు. మోడీ మంకుపట్టు, ట్రంప్ ప్రోద్బలం, పాకిస్థాన్ ప్రభుత్వం రాజీపడటం వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నాడు. తనను నిర్బంధించినంద మాత్రానికి కాశ్మీరు అంశం వెనక్కు పోతుందని వారు అనుకుంటే, అది ఎన్నటికీ జరగదన్నాడు.
దేవుడి దయతో కాశ్మీరు విముక్తమయ్యే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందన్నాడు. తన మద్దతుదార్లు, కార్యకర్తలు ప్రశాంతంగా ఉండాలని, అదే సమయంలో లక్ష్యం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చాడు. పాకిస్థాన్ భద్రతకు తాము ప్రాధాన్యమిస్తున్నామన్నాడు.
నిజాయితీ ఉందా: భారత్
హఫీజ్ సయీద్ గృహ నిర్బంధం వార్తలపై భారతదేశం ఘాటుగా స్పందించింది. హఫీజ్ను గృహ నిర్బంధంలో ఉంచిన సంఘటనలు పాకిస్థాన్లో గతంలో కూడా జరిగాయని, ఇప్పుడు అత్యంత నమ్మకమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ మంగళవారం మాట్లాడారు. హఫీజ్ సయీద్తోపాటు మరో నలుగురిపై పాకిస్థాన్ సోమవారం జారీ చేసిన ఆదేశాల వంటి సంఘటనలు గతంలోనూ జరిగాయన్నారు. ముంబై దాడుల సూత్రధారి పైనా, సరిహద్దులను దాటుతున్న ఉగ్రవాదంతో ప్రమేయమున్న ఉగ్రవాద సంస్థలపైనా నమ్మకమైన దాడి మాత్రమే పాకిస్థాన్ నిజాయతీని రుజువు చేస్తుందన్నారు.