లాడెన్లా వారిని మట్టుపెట్టాలి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను కలుపుకునే టైం వచ్చింది: బాబా రాందేవ్
న్యూఢిల్లీ: అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్కు పట్టిన గతే జైష్ ఏ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్, హఫీజ్ సయీద్లకు కూడా పట్టాలని ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ అన్నారు. జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో తీవ్రవాద దాడి నేపథ్యంలో నలబై మందికి పైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దీనిపై రామ్దేవ్ స్పందించారు.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలిపే సమయం వచ్చింది
లాడెన్కు పట్టిన గతి వీరిద్దరికి పట్టాలని బాబా రాందేవ్ అన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను భారతదేశంలో కలుపుకునేందుకు సమయం ఆసన్నమైందని చెప్పారు. అజహర్, హఫీజ్ సయీద్లను భారత్ రప్పించాలని లేకుంటే లాడెన్కు పట్టిన గతి పట్టాలని వ్యాఖ్యానించారు. ఇంతటి హేయమైన చర్యలకు పాల్పడిన పాకిస్తాన్కు దీటుగా జవాబివ్వాలని కేంద్రాన్ని ఆయన కోరారు.
ఉగ్రవాదులను మట్టుబెట్టాలి
సరిహద్దు గుండా మన దేశంలోకి చొరబడుతున్న లేక ఇప్పటికే దేశంలో ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టాలని కేంద్రానికి బాబా రామ్ దేవ్ సూచించారు. ముఖ్యంగా 2008లో ముంబై దాడుల సూత్రధారి అయిన హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ను అంతమొందించాలన్నారు. వారెక్కడున్నా భారత్కు తీసుకురావాలని లేదంటే బిన్లాడెన్కు పట్టిన గతే వారికి పట్టాలన్నారు. పాకిస్థాన్లోని అబోటాబాద్లో రహస్యంగా నివసిస్తోన్న బిన్లాడెన్ను అమెరికా దళాలు మట్టుపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రతీకారం తీర్చుకుంటామని మాటలు చెప్తాం కానీ
పాకిస్థాన్ పరిణితిలేని, నిరక్షరాస్య దేశంగా ప్రవర్తిస్తోందని, ప్రధాని మోడీ దానికి తగిన బుద్ధి చెప్పాలని, దాడికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని చాలా మాటలు చెప్తామని, కానీ వాటి వల్ల ఏ ఉపయోగం లేదని, ప్రధాని దీనిపై తగిన చర్య తీసుకోవాలని, దేశం మొత్తం ఆయనకు మద్దతుగా నిలుస్తుందని, ఇది ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, ఎటువంటి చౌకబారు రాజకీయాలకు చోటు ఉండకూడదని, ఇరు దేశాల వద్ద అణ్వస్త్రాలున్నాయని, ఇది దానికి సంబంధించిన విషయం కాదని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, వారిని వేటాడి, అంతమొందించాలని, మీరు పాక్తో సత్సంబంధాలు కోరుకుంటున్నారని, అది ఎప్పటికీ సాధ్యం కాదని, పాక్ అందుకు సిద్ధంగా లేదన్నారు. కాగా, మూడేళ్ల క్రితం ప్రధాని మోడీ కేవలం మాటలకు పరిమితం కాకుండా సర్జికల్ స్ట్రయిక్స్ ద్వారా చేసి చూపించారు. ఇతర నేతల్లా మాటలు చెప్పలేదని గుర్తు చేస్తున్నారు.