పాక్ సరిహద్దులో సంచరిస్తున్న హఫీజ్ సయీద్, ర్యాలీలు
న్యూఢిల్లీ: లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు, ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి హఫీజ్ సయీద్ జమ్మూకాశ్మీర్లోని సాంబా సెక్టర్ గుండా ఉండే పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శనివారం రాత్రి కనిపించాడు. అయితే హఫీజ్ సయీద్ సరిహద్దు ప్రాంతంలో సంచరించడం ఇదే తొలిసారి కాదు.
నిరుడు కూడా అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలోని అనేక చోట్లా, భారత నియంత్రణ రేఖ సమీపంలో పలుమార్లు సంచరించాడు. అంతేగాక ర్యాలీలు నిర్వహించాడు. ముంబై పేలుళ్లకు సూత్రధారి అయిన సయీద్, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది.
శనివారం సాయంత్రం నుంచి పాకిస్థాన్ దళాలు సరిహద్దు ప్రాంతంలో కాల్పులు జరపలేదు. కాగా, భారత సరిహద్దు సాంబా సెక్టార్ ప్రాంతానికి కేవలం 500 మీటర్ల దూరంలో ‘హఫీజ్ సయీద్ జిందాబాద్' అనే నినాదాలు వినిపించాయని భారత భద్రతా బలగాలు పేర్కొన్నాయి. పాకిస్థాన్ దళాలు కాల్పులు జరుపుతున్న ఉద్రిక్తత సమయంలో హఫీజ్ సయిద్ ఆ ప్రాంతంలో సంచరించాడని చెప్పాయి.
కాగా, పాకిస్థాన్ సైన్యం రెండు మూడు రోజుల నుంచి జరుపుతున్న కాల్పుల కారణంగా భారత సరిహద్దులోని గ్రామాల ప్రజల సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇప్పటికే సుమారు 1400 మంది ప్రజలు తమ స్వంత గ్రామాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.
హీరానగర్, చాన్ కంత్రియా, మెరీన్, కంత్వా, రెగాల్, చించి మాత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంపుల్లో వారందరూ తలదాచుకుంటున్నారు. శనివారం ఉదయం పాకిస్థాన్ దళాలు జరిపిన దాడుల్లో 8మంది పౌరులు గాయపడగా, ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.