ఈదురుగాలులు..వడగళ్ల వాన: పోలింగ్ కు అడ్డంకి కలిగించిన భారీ వర్షం
బెంగళూరు: బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల కర్ణాటక ఉత్తర ప్రాంతంలో మంగళవారం భారీగా వర్షాలు పడ్డాయి. చాలా ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. పలుచోట్ల చేతికి అందిన పంట ధ్వంసమైంది. పంట చేలో వర్షపు నీళ్లు చేరుకున్నాయి. ఉత్తర కన్నడ జిల్లాలోని ముండగోడిలో అధిక వర్షపాతం నమోదైంది. సుమారు 40 నిమిషాల పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో.. జనం బయటికి రావడానికి సాహసించలేదు. దీని ప్రభావం పోలింగ్ పై పడింది.
నేలకు ఒరిగిన వృక్షాలు..
శిరసి పట్టణంలో కూడా వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అయిదుకు పైగా చెట్లు నేలకూలాయి. చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో.. చాాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరా స్తంభించిపోయింది. రోడ్లపై వర్షపు నీరు చేరుకోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సాయంత్రం వరకూ అదే పరిస్థితి శిరసి పట్టణంలో నెలకొంది. పలుచోట్ల పోలింగ్ కేంద్రాల్లో వర్షపు నీరు చేరుకుంది. ఓటు వేయడానికి వచ్చిన ప్రజలు.. భారీ వర్షం దెబ్బకు తలోదిక్కునకు పరుగులు తీశారు. చాలాసేపటి వరకు పోలింగ్ కేంద్రాలు ఖాళీగా దర్శనం ఇచ్చాయి.
కాఫీనాడులోనూ ఇదే పరిస్థితి..
కాఫీనాడుగా పేరొందిన చిక్ మగళూరులోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఈ ప్రాంతంలోని మూడిగెరె, ఎన్ఆర్ పుర, బాళెహెన్నూరు వంటి చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. చాలాచోట్ల వడగళ్ల వాన పడింది. కాఫీ, తేయాకు పంటలకు ఈ వర్షం ఉపకరిస్తుందంటూ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా.. మరో 48 గంటల పాటు కర్ణాటకలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలు సహా, ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బెంగళూరులో కూడా చెదురు మదురు వర్షాలు నమోదయ్యాయి. జయనగర, విరూపాక్షపుర, జేపీ నగర, జంబూసవారి దిణ్ణె వంటి ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి.