ఉద్రిక్తత: సల్మాన్, షారుక్ సాయం కావాలని తృప్తి దేశాయ్
ముంబై: దేశవ్యాప్తంగా దేవాలయాల్లో మహిళల ప్రవేశాన్ని కోరుతూ పోరాటం చేస్తున్న భూమాతా బ్రిగేడ్ సంస్థ ఇప్పుడు ముస్లిం మహిళలను దర్గా, మసీదుల్లోకి ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తీ దేశాయ్ మహిళలతో కలిసి ముంబైలోని ప్రసిద్ధ హజీ అలి దర్గాలోనికి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆమెకు కొన్ని రోజుల క్రితం శివసేన నాయకుడు హజీ అరాఫత్ షేక్ హెచ్చరికలు చేశారు. తృప్తీ దేశాయ్ హజీ అలి దర్గాలోనికి ప్రవేశించాలని ప్రయత్నిస్తే చెప్పులతో కొడతారని అన్నారు. దీంతో తృప్తీ దేశాయ్ బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ల సాయం కోరారు.
లింగ వివక్షకు వ్యతిరేకంగా తాము చేస్తోన్న ఉద్యమానికి వీరు మద్దతు తెలిపాలని కోరారు. సల్మాన్, షారుక్ తమకు మద్దతు తెలిపితే వారి అభిమానులు హజీ అలి దర్గాలోనికి ప్రవేశించే క్రమంలో తమ ఉద్యమంలో కలుస్తారని తెలిపారు. కాగా, హజీ అలి దర్గాలోకి ప్రవేశిస్తే.. భూమాత రణరాగిని బ్రిగేడ్ నేత తృప్తి దేశాయ్ పై నల్లసిరా చల్లుతామని ఏఐఎంఐఎం హెచ్చరించింది.
హజీ అలీ దర్గా వద్ద ఉద్రిక్తత
హజీ అలీ సబ్ కేలీయే అంటూ ర్యాలీగా బ్రిగేడ్ సభ్యులతో తృప్తి దేశాయ్ హజీ అలీ దర్గా వద్దకు చేరుకున్నారు. ముస్లిం సాంప్రదాయవాదులు కూడా తృప్తి దేశాయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో తృప్తి దేశాయ్ను పోలీసులు అడ్డుకున్నారు.