యుద్ధ విమానాల వివరాలు పాక్ ఐఎస్ఐకి చేరవేత: హెచ్ఏఎల్ ఉద్యోగి అరెస్ట్
ముంబై: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)కు చెందిన ఓ ఉద్యోగిని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక పోలీసుల బృందం అరెస్ట్ చేసింది. యుద్ధ విమానాలు, తయారీ యూనిట్కు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్కు చెందిన నిఘా విభాగం ఐఎస్ఐకి చేరవేసినందుకు అతడిని అరెస్ట్ చేసినట్లు శుక్రవారం పోలీసులు వెల్లడించారు.
ఐఎస్ఐతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాడన్న పక్కా సమాచారంతో ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్) నాసిక్ విభాగం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దేశీయ యుద్ధ విమానాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సదరు ఉద్యోగి పాక్ ఐఎస్ఐతో పంచుకున్నట్లు అధికారులు తేల్చారు.
నాసిక్ సమీపంలో ఓజార్ ప్రాంతంలో ఉన్న హెచ్ఏఎల్ తయారీ కర్మాగారానికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందజేసినట్లు గుర్తించారు. అధికార రహస్యాల చట్టం కింద నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడి వద్ద నుంచి మూడు సెల్ఫోన్లు, ఐదు సిమ్ కార్డులు, రెండు మెమోరీ కార్డులు సీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిని కోర్టు ముందు హాజరుపర్చగా 10 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు.
కాగా, నాసిక్కు సమీపంలో 1964లో ఏర్పాటైన తయారీ కర్మాగారంలో మిగ్-21ఎఫ్ఎల్, మిగ్-21ఎం, మిగ్-21బీఐఎస్, మిగ్-27ఎం వంటి యుద్ధ విమానాలతోపాటు, కె-13 మిసైల్ కూడా ఇక్కడే తయారవుతున్నాయి. భారత రక్షణ రంగంలో ఎంతో కీలకంగా ఉన్న ఈ సంస్థకు సంబంధించిన సమాచారం నిందితుడు చేరవేయడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.