సమ్మె బాట పట్టిన 20వేల మంది హాల్ కార్మికులు...వేతనాల పెంపునకు డిమాండ్
బెంగళూరు: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) ఉద్యోగులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ నిరవధిక సమ్మెకు దిగనున్నారు. మొత్తం 20వేల మంది ఉద్యోగులు సమ్మెబాట పడుతున్నారు. తమ జీతభత్యాలను పెంచాలంటూ గతకొన్ని రోజులుగా వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కొన్ని వారాల పాటు చర్చలు కూడా జరిగాయి. అయితే చర్చలు విఫలమవడంతో హాల్ ఉద్యోగస్తులు సమ్మె సైరన్ మోగించారు. కార్మికులను ఒక రకంగా ఆఫీసర్లను మరో రకంగా హాల్ యాజమాన్యం చూస్తోందని హాల్ కార్మిక సంఘం ధ్వజమెత్తింది.
కార్మికులు లేవనెత్తిన డిమాండ్లపై గత కొద్దిరోజులుగా చర్చలు జరిగాయి. అయితే మేనేజ్మెంట్ మాత్రం వీరి డిమాండ్లకు అంగీకరించలేదు. దీంతో సోమవారం నుంచి తాము సమ్మె బాట పట్టనున్నట్లు ఆదివారం ప్రకటించింది హాల్ కార్మిక సంఘం. మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న ధోరణితోనే తాము బలవంతంగా సమ్మె చేయాల్సి వస్తోందని ఆల్ ఇండియా హాల్ ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ కమిటీ ప్రకటించింది. హాల్ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఫ్యాక్టరీలకు ఈ మేరకు లేఖ రాసింది. కార్మికులందరూ సోమవారం నుంచి సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఇదిలా ఉంటే హాల్ హెడ్క్వార్టర్స్ బెంగళూరులో ఉంది.
2016 నుంచి కార్మిక సంఘం మరియు మేనేజ్మెంట్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. కొత్తగా రివైజ్ చేసినవన్నీ జనవరి 1, 2017 నుంచి అమలు చేయాల్సి ఉన్నా.. అది జరగలేదు. అయితే కార్మికులు అసాధ్యమైన డిమాండ్లు చేస్తున్నారని వాటిని అమలు చేయలేమని మేనేజ్మెంట్ చెప్పింది. అదే సమయంలో ఎగ్జిక్యూటివ్ల సెటిల్మెంట్లో మాత్రం సానుకూలంగా స్పందించిన మేనేజ్మెంట్ కార్మికుల డిమాండ్లను ఎందుకు పట్టించుకోవడం లేదని కార్మికసంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే కార్మికులకు సంబంధించిన జీతభత్యాలు పాక్షికంగానే రివైజ్ అయ్యాయని కార్మిక సంఘాల జనరల్ సెక్రటరీ సూర్యదేవ్ చంద్రశేఖర్ చెప్పారు. సమ్మెకు దిగడం వల్ల దేశం నష్టపోతోందని చెబుతున్న మేనేజ్మెంట్, వారు కూడా ఇందలో భాగస్వాములే అని చెప్పారు. వారి కారణంగానే దేశం నష్టపోతుందని చెప్పారు.