ఫిబ్రవరి నాటికి దేశంలో సగం జనాభాకు కరోనా వైరస్... నిర్లక్ష్యం వహిస్తే అంతే సంగతి...
130 కోట్ల జనాభా ఉన్న భారత్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి సగం జనాభా కరోనా వైరస్ బారిన పడుతారని కోవిడ్ 19పై కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ అంచనా వేసింది. దాంతో ఇక వైరస్ వ్యాప్తి నెమ్మదిస్తుందని తెలిపింది. నిజానికి గతంతో పోలిస్తే ప్రస్తుతం దేశంలో తక్కువ కేసులే నమోదవుతున్నాయి. గత సెప్టెంబర్లో కేసుల సంఖ్య పీక్స్కి చేరగా.. ప్రస్తుతం సగటున రోజుకు 61,390 కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ అంటువ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి జరుగుతున్న సెరోలాజికల్ సర్వే విధానంలో లోపాలున్నాయని నిపుణుల కమిటీ పేర్కొనడం గమనార్హం.
ఫిబ్రవరి నాటికి 50శాతం మందికి...
నిపుణుల కమిటీ సభ్యుడు,ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ... 'మా మ్యాథమెటికల్ మోడల్ ప్రకారం ప్రస్తుతం భారత్లో 30శాతం జనాభా కరోనా బారినపడ్డారు. ఫిబ్రవరి,2021 నాటికి అది 50శాతానికి చేరుతుంది. నిజానికి కేంద్ర ప్రభుత్వ సెరోలాజికల్ సర్వేలు చూపిస్తున్న లెక్కల కంటే ప్రస్తుతం కరోనా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. జనాభాకు తగ్గ శాంపిల్ సైజును పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల సెరోలాజికల్ సర్వేలో లోపాలున్నాయి.' అని చెప్పారు.
కొత్త మోడల్తో కరోనా అంచనా...
'కరోనా వైరస్ వ్యాప్తిపై సరైన అంచనా కోసం మేము కొత్త మోడల్ను అభివృద్ది చేశాం. దీని ప్రకారం వైరస్ సోకినవారిని రెండు కేటగిరీలుగా విభజించాం. ఒక కేటగిరీ అధికారికంగా నమోదైన కేసులు కాగా... మరో కేటగిరీ అధికారికంగా నమోదు కాని కేసులు... ఈ లెక్క ప్రకారం వచ్చే ఫిబ్రవరి నాటికి దేశంలో సగం జనాభా కరోనా బారినపడుతుందని అంచనా వేస్తున్నాం. అయితే సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఈ నంబర్ మరింత పెరగవచ్చు. ఒకే నెలలో దాదాపు 2.6మిలియన్ల ఎక్కువ కేసులు నమోదు కావచ్చు.' అని మనీంద్ర అగర్వాల్ తెలిపారు. దేశంలో ప్రస్తుతం దుర్గా పూ,దివాళీ ఇతరత్రా పండుగల నేపథ్యంలో మరింత జాగ్రత్త అవసరమని నిపుణులు చెబుతున్నారు.
కేంద్రమంత్రి ఏమన్నారంటే...
మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ.. ప్రజలు కోవిడ్-19 నిబంధనలను సరిగా పాటిస్తే... వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో కేవలం 40,000 కరోనా యాక్టివ్ కేసులు ఉంటాయని తెలిపారు. కేసుల మోడల్ ఆధారంగా శాస్త్ర సాంకేతిక శాఖ శాస్త్రవేత్తల కమిటీ ఈ అంచనాకు వచ్చిందన్నారు. వైరస్ వ్యాక్సినేషన్ పద్దతులు,సిబ్బందికి శిక్షణ, వ్యాక్సిన్ సరఫరాకు రవాణా ఏర్పాట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేపట్టాల్సి ఉంటుందన్నారు.