ప్రమాదం: చేపలు అమ్ముతూ సెలబ్రిటీగా మారిన కేరళ గర్ల్ హనన్కి తీవ్రగాయాలు, పరిస్థితి విషమం
తిరువనంతపురం: చేపలు అమ్ముతూనే తన చదువును కొనసాగిస్తూ సోషల్ మీడియా సంచలనంగా మారిన కేరళ యువతి హనన్ హమీద్ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైంది. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి.
విషమంగానే పరిస్థితి..
కొడంగళూర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఆమెను కొచ్చిలోని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడం, వెన్నెముకకు బాగా దెబ్బ తగలడంతో ప్రస్తుతం హనన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రారంభోత్సవానికి వెళ్లి వస్తుండగా..
కోజికోడ్లోని వడాకర సమీపంలో ఓ దుకాణ ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా, ఇడుక్కిలోని ప్రైవేటు కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది హనన్.
చేపలు అమ్ముతూ ఫేమస్..
కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, తన కాలేజీ ఫీజుల కోసం కాలేజీకి వెళ్లిచ్చిన తర్వాత ఖాళీ సమయంలో చేపలు అమ్ముకోవడంతో హనన్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మీడియా కూడా ఆమెకు మంచి ప్రచారం కల్పించడంతో ఆమె చిన్నపాటి సెలబ్రిటీగా మారిపోయింది.
డాటర్ ఆఫ్ కేరళగా..
కాగా, తన ధైర్యాన్ని పట్టుదలను చూసి కేరళ సీఎం పినరయి విజయన్ కూడా హనన్ను మెచ్చుకున్నారు. ‘డాటర్ ఆఫ్ ది కేరళ గవర్నమెంట్' అని సీం కితాబివ్వడమే కాకుండా కేరళ ఖాదీకి ఆమెను అంబాసిడర్ కూడా నియమించారు.
వరద బాధితులకు రూ.లక్ష సాయం చేసిన హనన్
ఇది ఇలా ఉండగా, ఇటీవల కేరళ వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు రూ.లక్ష విరాళం అందించారు హనన్. ఈ క్రమంలో ప్రమాదానికి గురైన హనన్.. తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆమె అభిమానులు, స్థానికులు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.