భారత్తో మంచి సంబంధాలు కావాలా..? అయితే ఉగ్రవాదులను అప్పగించండి: జై శంకర్..
దాయాది పాకిస్థాన్ కుటిలబుద్ధిని, కుతంత్రాలను భారత్ ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంది. ఆ దేశం ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ నీతులు వల్లెవేస్తుందని అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెడుతుంది. దీనిపై విదేశాంగ మంత్రి జై శంకర్ కాస్త కటువుగానే స్పందించారు. పారిస్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి మీడియాకు కశ్మీర్, ఉగ్రవాదం గురించి వివరించారు.
కుళ్లు, కుతంత్రం..
పాకిస్థాన్ ఉగ్రవాదులను భారత్పైకి ఉసిగొల్పుతుందని జై శంకర్ పేర్కొన్నారు. అదీ నిరంతరం కొనసాగుతుందని, ఆపివేయబోదని చెప్పారు. ఈ మేరకు ప్రెంచ్ పత్రిక లీ మెండోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తమకు స్నేహహస్తం అందించాలని పాకిస్థాన్ భావిస్తే.. ఆ దేశంలో ఉన్న నేరస్థులను తమకు అప్పగించాలని సరతు విధించారు.
ఉగ్రవాదులను అప్పగించండి..
క్రిమినల్స్, ఉగ్రవాదులను తక్షణమే అప్పగించాలని డిమాండ్ చేశారు. దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్కు ఆశ్రయం కల్పిస్తారు. పైకి మాత్రం మరొటి చెబుతారని దుయ్యబట్టారు. ఇది ఇప్పటిది కాదని.. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రక్రియ అని పేర్కొన్నారు. ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటుచేసి భారత్పైకి ఉసి గొల్పుతుందని దుయ్యబట్టారు.
ఏం మాట్లాడాలి
ఇప్పుడు చెప్పండి దాయాది దేశంతో ఏ అంశాలపై మాట్లాడాలి, దేని గురించి చర్చించాలి అని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్తో చర్చలు జరపాలా అని అడిగారు. తమకు నీతిగా, నిజాయితీగా సహకరించే వారే కావాలని.. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేవారితో చేతులు కలుపుతామని చెప్పారు.
అప్పగించిన తర్వాతే
ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదులుగా గుర్తించిన ముంబై బాంబ్ పేలుళ్ల వ్యుహకర్త హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్, దావూద్ ఇబ్రహీంలకు పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించారు. వారంతా పాకిస్థాన్ రక్షణలో ఉంటున్నారని తెలిపారు.
అందుకే విభజన
సరిహద్దులో ఉగ్రవాదం పెట్రేగిపోవడంతోనే కశ్మీర్ విభజన కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జై శంకర్ వివరించారు. కశ్మీర్ లోయలో ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొందని జై శంకర్ వివరించారు. భారత్తో చైనా సంబంధాలు బాగానే ఉన్నాయని.. రెండు దేశాలు గొప్పవని జై శంకర్ అభిప్రాయపడ్డారు.