మళ్లీ బరితెగించిన పాక్: ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి, ఓ ఉగ్రవాది హతం
శ్రీనగర్: ప్రపంచం అంతా కరోనావైరస్తో పోరాడుతుంటే.. మనదేశం మాత్రం కరోనాపాటు మరో మహమ్మారి అయిన పాక్ ఉగ్రవాదాన్ని కూడా ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఐదుగురు భారత సైనికాధికారుల ప్రాణాలు తీసిన పాక్ ఉగ్రవాదులు సోమవారం మరో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్నారు.
జమ్మూకాశ్మీర్లోని కుప్వారా జిల్లా హంద్వారాలో సోమవారం ఉగ్రవాదుల ఏరివేత చర్యలో భాగంగా కూంబింగ్ చేపట్టారు సీఆర్పీఎఫ్ జవాన్లు. ఈ సమయంలోనే ఉగ్రవాదులు ఒక్కసారిగా జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. భారత భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యారు.
ఉగ్రవాదుల కాల్పుల్లు మరో ఏడుగురు జవాన్లు గాయాలపాలయ్యారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో కల్నల్ అశుతోష్ శర్మ సహా ఐదుగురు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటన మరువకముందే మరోసారి పాకిస్థాన్ ఉగ్రవాదులు ఘోరానికి తెగబడ్డారు.