బహిరంగంగా ఉరితీయండి: దిశ ఘటనపై జయాబచ్చన్ డిమాండ్, ముక్తకంఠంతో పార్లమెంటు
న్యూఢిల్లీ: దిశ అత్యాచారం, హత్య ఘటనపై పార్లమెంటులో చర్చ జరిగింది. ఈ ఘటనను సభ్యులంతా ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు.
ఉవ్వెత్తున 'దిశ’ నిరసన: జంతర్ మంతర్ వద్ద రేవంత్ రెడ్డి ధర్నా.. చేతకాకపోతే ప్రజలే శిక్ష...
బహిరంగంగా ఉరితీయండి..
ఈ దారుణానికి పాల్పడిన దోషులను ఎటువంటి క్షమాభిక్ష లేకుండా వెంటనే బహిరంగంగా ఉరితీయాలని జయా బచ్చన్ డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాలంటూ ప్రజలు నిలదీయాల్సిన సమయం ఇదేనని ఆమె అన్నారు.
నిర్భయకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని జయాబచ్చన్ అన్నారు. ఇలాంటి దారుణాలపై ఇక్కడ నిల్చుని ఎన్నిసార్లు మాట్లాడానో తనకు కూడా గుర్తు లేదని అన్నారు. కొన్ని దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలే బహిరంగంగా శిక్షిస్తారని ఆమె అన్నారు. మనదేశంలో కూడా ఇలాంటి శిక్షలు అమలైతేనే నేరం చేయడానికి భయపడతారని అన్నారు.
దేశం తలదించుకునేలా చేసింది..
దిశ అత్యాచారం, హత్య ఘటన దేశంలోని ప్రతి ఒక్కరినీ బాధించిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. లోక్సభలో ఆయన దిశ ఘటనపై మాట్లాడుతూ.. ఈ ఘటన దేశం మొత్తం తలదించుకనేలా చేసిందన్నారు. ప్రతి ఒక్కరినీ బాధించిందని, దోషులకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలని అన్నారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అకృత్యాకలు నిలువరించేందుకు ఎటువంటి చట్టాలు తీసుకొచ్చేందుకైనా సిద్ధమేనని అన్నారు.
వెంటనే కఠినంగా శిక్షించాలి
చట్టాల్లో మార్పులు చేసే విషయంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇక హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దిశ హత్య ఘటన చాలా బాధాకరమని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దిశను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారని, నిందితులకు వెంటనే కఠినంగా శిక్షించాలన్నారు.
తెలుగు ఎంపీల ఆగ్రహం..
ఇతర సభ్యులు కూడా దిశ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే ఎంపీ విజిల సత్యానంద్ ఈ విషయంపై మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు బండి సంజయ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రామ్మోహన్నాయుడు, వంగా గీత, రేవంత్ రెడ్డి లోక్సభలో మాట్లాడుతూ.. దిశ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులకు వెంటనే కఠిన శిక్షపడితేనే బాధితురాలికి న్యాయం జరుగుతుందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు.