Hangama: రండిబాబు రండి, 10 పైసలకే బిర్యానీ, గంగజాతర, దూలతీరింది యదవకి, ఏదో అనుకుంటే !
చెన్నై/ తిరుచ్చి: భారతదేశంలో బిర్యానీ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ బిర్యానీ, తమిళనాడు అంబూర్ బిర్యానీ, కర్ణాటక దొన్నే బిర్యానీ, కుండ బిర్యానీల పేర్లులు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిర్యానీ ప్రియులను టార్గెట్ చేసుకుని, వారి హోటల్ పేరు మారుమోగిపోయేలా చెయ్యడానికి 10 పైసలకే బిర్యానీ అంటూ ప్రకటన ఇచ్చేశారు. నాలుగు గంటల పాటు 10 పైసల బిర్యానీ తినడానికి కిలోమీటరు పొడవు నిలబడిన బిర్యానీ ప్రియులు చివరికి నిరాశ చెందారు. 10 పైసల బిర్యానీ హోటల్ ముందు నానా రచ్చ కావడంతో అధికారులు ఆ హోటల్ యాజమాన్యం మీద కేసు నమోదు చెయ్యడంతో వారి దూలతీరిపోయింది. ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది అంటూ హోటల్ యజమాని నెత్తినోరు కొట్టుకుంటున్నాడు.
Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!
ప్రపంచ బిర్యానీ దినోత్సవం
ప్రపంచ బిర్యానీ దినోత్సవాన్ని ఆదివారం (అక్టోబర్ 11వ తేదీ) ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రకరకాల బిర్యానీలు చేసిన హోటల్ యాజమాన్యం వారివారి కస్టమర్లను ఆకట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, విజటబుల్ బిర్యానీ ఇలా అనేక రకాల నోరూరించే బిర్యానీలు చేసి కస్టమర్లను ఆకట్టుకున్నారు.
తిరుచ్చిలో తిరుణాల
తమిళనాడులోని తిరుచ్చిలో బిర్యానీలకు ఫేమస్ అని పేరు తెచ్చుకున్న ఓ ప్రముఖ హోటల్ యాజమాన్యం ప్రపంచ బిర్యానీ దినోత్సవం సందర్బంగా 10 పైసలకే బిర్యానీ అంటూ ముందుగానే ప్రకటన ఇచ్చేసింది. అంతే హోటల్ యాజమాన్యం ఇచ్చిన ప్రకటన చూసిన బిర్యానీ ప్రియులు ఉదయం కోడికూయక ముందే హోటల్ ముందు సుమారు 700 మందికి పైగా గుమికూడటంతో ఆ ప్రాంతం తిరుణాలను తలపించింది.
బాటసారులను భయపెట్టిన బిర్యానీ క్యూ లైన్
తమిళనాడులో కరోనా వైరస్ ఏరకంగా తాండవం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళనాడులో కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి కట్టుదిట్టమైన నియమాలు అమలు చేశారు. అయితే తిరుచ్చిలోని బిర్యానీ హోటల్ ముందు కరోనా వైరస్ ను లెక్కచెయ్యకుండా 10 పైసల బిర్యానీ తినడానికి ప్రజలు వందల సంఖ్యలో గుమికూడటంతో అటువైపు వెలుతున్న బాటసారులు (పాదచారులు) భయంతో హడలిపోయారు.
144 సెక్షన్ లేదు.... తొక్కాలేదు
కరోనా వైరస్ దెబ్బకు తిరుచ్చిలో ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉంది. అయితే 10 పైసల బిర్యానీ దెబ్బతో 144 సెక్షన్ నియమాలు గాలికి వదిలేసిన బిర్యానీ ప్రియులు హోటల్ ముందు భారీ సంఖ్యలో గుమికూడటంతో పరిస్థితి విషమించింది. విషయం తెలుసుకున్న పోలీసులు హోటల్ ముందు జాతరకు వచ్చినట్లు వచ్చిన ప్రజలను అరికట్టడానికి నానా తంటాలు పడ్డారు.
పోలీసులకు ఆఫర్ ఇచ్చిన ప్రజలు
ముఖానికి మాస్క్ లు వేసుకోకుండా, భౌతికదూరం పాటించకుండా 10 పైసల బిర్యానీ కోసం గుమికూడిన ప్రజలకు సర్ధిచెప్పడానికి పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఆ సమయంలో సార్ మీరు కూడా బిర్యానీ తినండి, మా ప్రాణాలు ఎందుకుతింటున్నారు అంటూ ప్రజలు జోకులు వెయ్యడంతో పోలీసులు బిత్తరపోయారు. అయితే ముందుగా వచ్చిన 100 మందికి మాత్రమే 10 పైసలకు బిర్యానీలు ఇస్తామని హోటల్ యాజమాన్యం ముందుగా టోకన్లు జారీ చెయ్యడంతో మిగిలిన సుమారు 600 మందికి పైగా బిర్యానీ ప్రియులు నిరాశతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
హోటల్ యాజమాన్యం వింతవాదన
కరోనా వైరస్ వ్యాపించడానికి కారణం అయ్యారని ఆరోపిస్తూ హోటల్ యాజమాన్యంపై కార్పోరేషన్ అధికారులు, వైద్యశాఖ, పోలీసు అధికారులు మండిపడ్డారు. నువ్వు ఏం చేశావో నీకు తెలుసా ? అంటూ హోటల్ యాజమానిపై విరుచుకుపడ్డారు. పురాతన నాణేలను ప్రోత్సహించడానికి తాము 10 పైసలకే బిర్యానీ అని ప్రకటన ఇచ్చామని, అయితే ఇంత మంది వస్తారని మేమూ ఊహించలేదని, మమ్మల్ని క్షమించాలని హోటల్ యాజమాన్యం చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.
హోటల్ యజమాని దూలతీరిపోయింది
కేసు నుంచి తప్పించుకోవడానికి హోటల్ యజమాని పురాతన నాణేలను తెరమీదకు తెచ్చాడని మండిపడిన పోలీసులు కరోనా వైరస్ వ్యాపించడానికి కారణం అయ్యారని ఆరోపిస్తూ హోటల్ యాజమానిపై వివిద సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. మొత్తం మీద 10 పైసల బిర్యానీ దెబ్బకు తిరుచ్చిలో ఆ హోటల్ పరిసర ప్రాంతాల ప్రజలకు, పోలీసులకు హోటల్ యజమాని సినిమా చూపించాడు. 10 పైసల బిర్యానీ కోసం క్యూలో నిలబడిన సమయంలో కొందరు తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.