చిన్నారికి న్యాయం జరిగింది : కథువా తీర్పుపై విచారణ అధికారి రమేశ్
పఠాన్కోట్ : కథువాలో చిన్నారిపై లైంగికదాడి చేసి, మట్టుబెట్టిన నరహంతకులకు సరైన శిక్ష పడిందని అభిప్రాయపడ్డారు ఈ కేసును విచారించిన సీనియర్ ఎస్పీ రమేశ్ కుమార్. ఏడాదిన్నర క్రితం జరిగిన ఘటనకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ పర్వాన్ని తీర్పు సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టంచేశారు. విచారణ సాఫీగా సాగిందని .. కానీ కొందరు మతం రంగు పులిమే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.
మానవమృగాలకు జీవిత ఖైదు : పోలీసులకు ఐదేళ్ల జైలు, కథువా లైంగికదాడి కేసులో కోర్టు తీర్పు
ఎట్టకేలకు
లైంగిక దాడి కేసుకు సంబంధించి పఠాన్ కోర్టు తీర్పును స్వాగతించారు రమేశ్. దీంతో ఎనిమిదేళ్ల చిన్నారికి న్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. కిరాతకుల చేతిలో హత్యకు గురైన పసిమొగ్గ ఆత్మకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. చిన్నారిని చిత్రహింసలకు గురిచేసిన వారికి శిక్ష పడటంతో పైనుంచి చిన్నారి చూసి సంతోషిస్తుందని తెలిపారు. ఈ కేసు విచారణ జరిగిన తీరును వివరించారు. లైంగికదాడి చేసి హత్యచేసిన సాంజీరాం, అతని అనుచరుల చర్యలను వెల్లడించారు. లైంగికదాడి చేసి .. హతమార్చి కేసు నుంచి తప్పించుకునేందుకు ఆడిన నాటకాలను తెలిపారు.
ఒత్తిళ్లు లేవు ..
కేసు విచారణ సందర్భంగా తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టంచేశారు రమేశ్. ఘటన జరిగిన సమయంలో కశ్మీర్లో పీడీపీ, బీజేపీ భాగస్వామ్యంలో ప్రభుత్వం అధికారంలో ఉంది. 'విచారణ సందర్భంగా ఏ రాజకీయ నాయకుడి నుంచి ఒత్తిడి రాలేదు. పీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు కేసు విషయంలో కలుగజేసుకోలేదు. క్రైం బ్రాంచ్ సీనియర్ ఎస్పీగా పనిచేసి రిటైర్ అయ్యాను .. ఈ సమయంలో అబద్దం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పదవీ విరమణ చేసినందున తన పేరు ఎక్కడ చెడిపోదని, ఎవరూ తన పేరును చెడుగా చెప్పుకోరన్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కోర్టుకు ఆధారాలను సమర్పించాం‘ అని స్పష్టంచేశారు.
మతరంగు పులిమే యత్నం ?
ఈ కేసుకు కొందరు మతం రంగు పూయాలనుకున్నారని .. కానీ మాజీ మంత్రులు కూడా కలుగజేసుకోలేదని తేల్చిచెప్పారు. కానీ మేం మీడియా నుంచి మాత్రం ఒత్తిడిని ఎదుర్కొన్నామని గుర్తుచేశారు. కొన్నిసార్లు భిన్న అంశాలను చూపించడంతో .. ఏది కరెక్టో, ఏదీ తప్పో నిర్ధారించేందుకు సమయం పట్టిందని పేర్కొన్నారు. లైంగికదాడి కేసుకు సంబంధించి గతేడాది ఏప్రిల్లో కథువా చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కు అందజేసినట్టు వివరించారు. విచారణకు సంబంధించిన పత్రాలను తాము ఎవరికీ అందజేయలేదని .. కోర్టుకు నివేదించినట్టు స్పష్టంచేశారు. మీడియా, మంత్రులకు కూడా విచారణ కాపీ ఇవ్వలేదని తేల్చిచెప్పారు. అయితే కొందరు రౌడీలతో కిందిస్థాయి అధికారులు ఇబ్బందిపడ్డ మాట వాస్తవమేనని అంగీకరించారు. కానీ మంత్రులు, ఇతర సీనియర్ నేతలు మాత్రం కేసు విచారణలో కలుగజేసుకోలేదన్నారు.