రేపిస్టులను కాల్చివేస్తా: కమిషనర్ సంచలన వ్యాఖ్య
న్యూఢిల్లీ: రాజ్యంగం అనుమతి ఇస్తే మహిళలపై నేరాలకు ఒడిగట్టే వారిని సంఘటనా స్థలంలోనే కాల్చిపారేస్తామని, ఈ విషయంలో పోలీసులు ఏ మాత్రం సంకోచించరని ఢిల్లీ నగర పోలీసు కమిషనర్ బీఎస్. బస్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే మన రాజ్యంగం అలాంటి వాటికి అనుమతి ఇవ్వదని, పోలీసులు ప్రతి వ్యక్తి మానవహక్కులను గౌరవిస్తూ రాజ్యంగం ప్రకారం నడుచుకుంటున్నారని బస్సీ వెంటనే వివరణ ఇచ్చారు. మహిళలను ప్రతి ఒక్కరు గౌరవించాలని మనవి చేశారు.
భారత రాజ్యంగం అనుమతించి ఉంటే ఢిల్లీ పోలీసులు మహిళలపై నేరాలకు పాల్పడేవారిని సంఘటనా స్థలంలో కాల్చివేయడమో, ఉరి తియ్యడమో చేసేవారు. అయితే మేం మానవహక్కలకు కట్టుబడి ఉన్నామని, వాటిని గౌరవిస్తామని బస్సీ స్పష్టం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు కారణం లింగ నిస్పత్తిలో భారీ అగాధం ఉండటమే అన్నారు. ప్రస్తుతం వెయ్యి మంది పురుషులకు 600 మంది మహిళలు ఉన్నారు. కొందరు మగవాళ్లు మహిళలను తల్లిగా, చెల్లిగా, కుమార్తెగానే చూడటం లేదని విచారం వ్యక్తం చేశారు.
మహిళలను కేవలం సరుకుగా భావిస్తున్నారని అన్నారు. అందువల్లే 21 ఏళ్ల యువకుడు 80 ఏళ్ల వృద్దురాలు, 5 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేస్తున్నాడని బస్సీ వివరించారు. మహిళల భద్రతకు ఢిల్లీ పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
ఇదే సందర్బంలో అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్ సర్కార్ ఆధీనంలో లేకపోవడం మా అదృష్టం అంటూ బీఎస్. బస్సీ సంతోషం వ్యక్తం చేశారు.
తాము కేజ్రీవాల్ ప్రభుత్వం ఆధీనంలో ఉంటే స్థానిక ప్రయోజనాల కారణంగా తమ మీద రాజకీయ ఒత్తిడి ఉండేదని, ప్రధాని, కేంద్ర హోం శాఖ మంత్రికి ఆ ఉద్దేశం లేకపోవడంతో స్వేచ్చగా తమపని తాము చేసుకుని వెలుతున్నామని బీఎస్. బస్సీ తెలిపారు.