నమ్మదగిన వాడినే, ఇప్పటికైనా: ఎ రాజా భావోద్వేగ లేఖ, హ్యాపీ అంటూ మన్మోహన్
న్యూఢిల్లీ: కేంద్ర టెలికం శాఖ మాజీ మంత్రి ఎ రాజా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు భావోద్వేగంతో కూడిన ఓ లేఖ రాశారు. ఇప్పటికైనా తనకు అండగా నిలవాలని ఆ లేఖలో ఆయన కోరారు.
2 జీ స్పెక్ట్రం కేసులో ఎ రాజా, కనిమొళితోసహా 14 మంది నిర్దోషులుగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కేసులో నుంచి బయటపడిన తర్వాత ఒకప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ మంత్రి మండలిలో ఒకరైనా రాజా తొలిసారి ఆయనకు లేఖ రాశారు.
నమ్మదగిన వాడినే..
‘మీరు నాకు బహిరంగంగా మద్దతు ఇవ్వకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని నాకు తెలుసు. ఈ రోజు నేను నిర్దోషిగా నిలబడ్డాను. ఈ విషయం మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఎప్పటికీ నమ్మదగినవాడినని, విశ్వసనీయుడినని మరోసారి గుర్తుచేసుకుంటున్నాను' అని ఎ రాజా మాజీ ప్రధాని మన్మహన్ సింగ్కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఇప్పటికైనా అండగా ఉంటారని..
అంతేగాక, ‘2జీ కేసులో నిజమేమిటో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికైనా గతంలో మాదిరిగా కాకుండా నాకు అండగా ముందుకొస్తారని అనుకుంటున్నాను. 2జీ కేసు యూపీఏ ప్రభుత్వాన్ని మూల్యం చెల్లించుకునేలా చేసింది. 15 నెలల జైలు జీవితంతోపాటు నా ఏడేళ్ల జీవితాన్ని తీసుకెళ్లింది' అంటూ ఎ రాజా తన లేఖలో పేర్కొన్నారు.
సంతోషమంటూ మన్మోహన్
కాగా, ఎ రాజా లేఖపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. 2జీ కేసు నుంచి నిర్దోషులుగా బయటపడినందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
ఇబ్బందులు తెలుసు.. చివరికి..
2జీ కేసులు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో మీరు మీ కుటుంబసభ్యులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో తనకు తెలుసునని ఎ రాజాకు సమాధానంగా మన్మోహన్ సింగ్ తెలిపారు. చివరకు నిజమెంటో అందరికీ తెలిసిందని ఆయన అన్నారు.