నిరుపేద కుటుంబం వాడేది ఒక బల్బ్ , ఒక ఫ్యాన్.. కరెంట్ బిల్లు వచ్చింది మాత్రం రూ.128 కోట్లు..!
హపూర్ : అధికారుల నిర్లక్ష్యమో, టెక్నాలజీ తీసుకొచ్చిన తంటానో తెలియదు కానీ .. వారి పాలిట మాత్రం శాపమైంది. కరెంట్ బిల్లు వాడినంత వస్తోంది, లేదంటే వందో, రెండోందలు ఎక్కువగా చూస్తుంటాం, వింటుంటాం. కానీ అతనికి వచ్చిన బిల్లు చూసి ఆ దంపతులు మూర్ఛపోయారు. చుట్టుపక్కల వాళ్లు షాక్నకు గురయ్యారు. ఇంతకీ వారికి కరెంట్ బిల్లు ఎంత వచ్చింది తెలుసా .. వందలు కాదు వేలు కాదులక్షలు అంతకన్నా కాదు .. అవును కోటికి పైగా పవర్ బిల్లు రావడంతో నోరెళ్లబెట్టడం వారి వంతైంది.
బిల్లు కలకలం ...
యూపీలోని హపూర్ జిల్లా చార్మీకి చెందిన షమీమ్, ఖైరు నిషా దంపతులు నివసిస్తున్నారు. ఏదో పని చేసుకుని కాలం వెళ్లదీస్తున్న వీరికి .. విద్యుత్ అధికారులు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే షాకిచ్చారు. నెల నెల కరెంట్ బిల్లు వస్తోంది. కానీ వారికి ఇటీవల వచ్చిన పవర్ బిల్లు చూసి మూర్ఛపోయారు. ఇంతకీ ఎంత వచ్చిందో తెలుసా 128 కోట్ల రూపాయల బిల్లు వచ్చింది. ఆ బిల్లు చూసి నిజమో, అబద్దమో, సాంకేతిక లోపమో తెలియక ఇబ్బంది పడ్డారు. పదే పదే చూసినా బిల్లు మాత్రం వంద కోట్లపైనే ఉంది.
ఒక్కసారిగా షాక్ ..
వెంటనే విద్యుత్ అధికారులను సంప్రదించాడు షమీమ్. తన కరెంట్ బిల్లు గురించి వివరించాడు. అయ్యో పాపం అనాల్సిన అధికారులు తమ జలుం ప్రదర్శించాడు. కరెంట్ బిల్లు ఎంత వస్తే అంత కట్టాల్సిందేనని పురామయించారు. అదేంటి వంద కోట్లు తాను ఎక్కడినుంచి తేవాలి అని ప్రశ్నించారు. అదేం మాకు తెలియదు బిల్లు మాత్రం కట్టాల్సిందేనని హుకుం జారీచేశారు. అంతేకాదు బిల్లు కట్టేవరకు విద్యుత్ సరఫరా చేయబోమని మొండిగా తెగేసి చెప్పారు. తన కరెంట్ బిల్లు కష్టాలు తెలిపేందుకు షమీమ్ ఎక్కని కార్యాలయం లేదు, అడగని అధికారి లేడు. దీంతో విసిగి వేసారి ఏం చేయాలని తన భార్యతో కలిసి ఆలోచించాడు.
బల్బ్, ఫ్యాన్కే ..
ఇంతకీ షమీమ్ దంపతులు వాడుతుంది ఏంటో తెలుసా. వారి చిన్నపాటి ఇంట్లో ఒక ఫ్యాన్, ఒక బల్బ్ మాత్రమే. ఈ బిల్లు చూసి షమీమ్ భార్య ఖైరు నిషా నోరెళ్లబెట్టింది. అసలే కడు పేదరికంతో ఉన్న తమకు ఈ బిల్లు కష్టాలెంటని ఆమె నిట్టూరుస్తున్నారు. పొట్ట కూటి కోసం పని చేసే తాము అన్ని కోట్లు ఎక్కడినుంచి తీసుకొచ్చి కట్టాలి అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై విద్యుత్ శాఖ ఏఈ రాంచరణ్ను మీడియా ప్రతినిధులు వివరణ కోరగా .. ఆయన చాలా తేలిగ్గా తీసుకున్నారు. షమీమ్ ఫ్యామిలీకి సాంకేతిక లోపం ద్వారా పవర్ బిల్లు వచ్చిందని అంగీకరించారు. ఆ సమస్యను తాము పరిస్కరిస్తామని పేర్కొన్నారు. కానీ అంతకుముందు వారు బిల్లు కట్టాలనే మెలిక పెట్టారు. అంతేకాదు ప్రతీ సారి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయని .. దానిని భూతద్దంలో పెట్టి చూడటం సరికాదనే హితోపదేశం చేశారు.