డాక్టర్కు తప్పని వర్ణ వివక్ష : కులం పేరుతో దూషించడంతో బలవన్మరణం, ముంబైలో ఘటన
ముంబై : చదివింది ప్రాణం పోసే వైద్య వృత్తి. ప్రాక్టీస్ చేస్తున్నారు. మరికొద్దిరోజుల్లో రోగులకు నయం చేయాల్సిన డాక్టర్లు. కానీ వారి మెదడులో కులజాఢ్యం నాటుకుపోయింది. వెనుకబడిన వర్గానికి చెందిన తమ తోటి డాక్టర్ను కులం పేరుతో వేధించారు. అయినా భరించించడమే ఆ వైద్యురాలు చేసిన పాపమైంది. నిండు ప్రాణం బలితీసుకునేందుకు కారణమైంది.
కలత చెంది ..
ముంబై సెంట్రల్లో గల బీవైల్ నాయర్ హాస్పిటల్లో రాయల్ సల్మాన్ టాడ్వి అనే విద్యార్థి గైనకాలజీ విభాగంలో పీజీ చేస్తోంది. ఆమెతోపాటు హేమ, భక్తీ, అంకిత అనే సీనియర్లు చదువుతున్నారు. వారు డాక్టర్లు .. నలుగురికి మంచి చెప్పాల్సిన సీనియర్లు వక్రబుద్ధి చూపించారు. పాయల్ను కులం పేరుతో వేధించారు. ఎస్పీ కులానికి చెందిన ఆమెను కులం పేరుతో దూషించారు. తొలుత ఆమె కూడా క్యాజువల్ గా తీసుకుంది. కులం పేరుతో దూషణలు ఎక్కువవడంతో భరించలేకపోయింది. వారిపై కాలేజీ యజమాన్యానికి కూడా ఫిర్యాదు చేసింది. అయినా వారు స్పందించలేదు. సరైన చర్యలు తీసుకోలేదు. ఆ ముగ్గురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఉంటే ఓ విద్యా కుసుమం నేలరాలి ఉండేది కాదు.
వేధింపులు తాళలేక ..
కాలేజీ, ప్రాక్టీస్ చేసే హాస్పిటల్ వద్ద వేధింపులు ఎక్కువయ్యాయి. ఇక భరించలేని పాయల్ .. విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు ఇప్పటికే పీజీ చేస్తున్నావు .. కదా ... మరికొద్దిరోజులు సర్దుకొమ్మని చెప్పడంతో .. తాను పడుతున్న బాధను ఎవరికీ చెప్పుకోలేకపోయింది. ఇటు వేధింపుల పర్వం ఎక్కువవడంతో చివరికి బుధవారం తన బీవైఎల్ నాయర్ హాస్టల్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియాలో కూడా ..
అంతేకాదు ఆ ముగ్గురు .. పాయల్ ను తమ వాట్సాప్ గ్రూపులో కూడా కులం పేరుతో నిందించేవారని విచారణలో వెలుగుచూసింది. ఈ ఘటనపై ముగ్గురు వైద్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి .. లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అప్రిగడ పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనను దళిత సంఘాలు ఖండిస్తున్నాయి. ప్రాక్టీస్ చోట డాక్టర్ పై వేధింపులు ఏంటని మండిపడ్డారు. ఆ ముగ్గురు వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.