IIT విద్యార్థులకు షాక్..నో ఆఫర్ లెటర్స్... నో ప్లేస్మెంట్స్ ,ఆసక్తి చూపని బడా కంపెనీలు
న్యూఢిల్లీ: కరోనావైరస్తో ప్రపంచం అంతా వణుకుతోంది. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. ఇక భారత దేశంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా సంస్థలు కూడా నష్టాల బాట పడుతున్నాయి. ఇక తమ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రస్తుత పరిస్థితితో ఆందోళన చెందుతున్నారు. ఇక ఆయా సంస్థలు నిర్వహించే క్యాంపస్ రిక్రూట్మెంట్లు కూడా తగ్గిపోయాయి. ఇక ఐఐటీల్లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థుల పరిస్థితి కూడా దారుణంగా తయారైంది.
10 మందిలో ముగ్గురికి మాత్రమే ఉద్యోగాలు
ఐఐటీల్లో ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు ఈ ఏడాది కలిసిరాలేదనే చెప్పాలి. ఉన్నత విద్యను అభ్యసించి క్యాంపస్ నుంచి బయటకు అడుగు పెట్టేలోగా కనీసం మూడు కంపెనీల నుంచి మూడు ఆఫర్ లెటర్లతో వచ్చే విద్యార్థులకు ఈ సారి నిరాశే మిగిలింది. కరోనావైరస్ నేపథ్యంలో విద్యార్థులను రిక్రూట్ చేసుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం ప్రతి 10 మందిలో ముగ్గురికి ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్ లెటర్ దక్కలేదని తెలుస్తోంది. సాధారణంగా మార్చి ఏప్రిల్ మాసాల్లో ఆయా సంస్థలు ఐఐటీ క్యాంపస్లకు వచ్చి రిక్రూట్మెంట్ చేసుకుంటాయి. ఇప్పటికే ఐఐటీ సంస్థలు ఆయా సంస్థలతో టచ్లో ఉన్నట్లు సమాచారం.
కొన్ని కంపెనీలు ఆఫర్లను ఉపసంహరించుకుంటున్నాయి
ఇదొక దురదృష్టకరమైన పరిస్థితి అని ఐఐటీ కాన్పూర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కంటేష్ బాలాని తెలిపారు. ఇక ఐఐటీల్లో చదివి కంపెనీల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ఉన్న పూర్వ విద్యార్థులతో కూడా ఐఐటీలు టచ్లోకి వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆఫర్లెటర్లు తీసుకున్న విద్యార్థులకు సహాయం చేయాల్సిందిగా వారు కోరుతున్నట్లు తెలుస్తోంది. చాలావరకు ఐఐటీలు అంటే మద్రాస్ ఐఐటీ, కాన్పూర్, ఢిల్లీ, రూర్కీ, గౌహతి, మరియు బాంబే ఐఐటీలు తమ క్యాంపస్లోని విద్యార్థులకు కేవలం గార్ట్నర్ మాత్రమే ఆఫర్ లెటర్లను ఉపసంహరించుకున్నట్లు ధృవీకరించాయి. ఇక ఇప్పటికే ఆఫర్ లెటర్లు ఇచ్చిన సంస్థ స్క్లమ్బర్గర్ విద్యార్థులను రిక్రూట్ చేసుకున్న పొజిషన్కు కాకుండా ఇతర పొజిషన్లో నియమించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కొన్ని ఐఐటీల్లో ఆన్లైన్ ద్వారా ప్లేస్మెంట్స్ జరిగాయి. లాక్డౌన్ నేపథ్యంలో అన్నీ షట్డౌన్ కావడంతో ప్రస్తుతానికి రిక్రూట్మెంట్లను ఆయా సంస్థలు నిలిపివేశాయి.
Recommended Video
జాయినింగ్ తేదీలను పొడిగిస్తున్న కొన్ని కంపెనీలు
ఐఐటీ చెన్నైలో 1331 విద్యార్థులకు గాను 924 మందికి ఉద్యోగాలు లభించాయి. ఇంకా 30శాతం మందికి ఉద్యోగాలు రావాల్సి ఉంది. ఇక ఐఐటీ రూర్కీ మాత్రం ఇంటర్వ్యూలు ఆన్లైన్లో నిర్వహించాలంటూ కంపెనీలను కోరుతోంది. ఇప్పటి వరకు ఐఐటీ రూర్కీకి సంబంధించి విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్ లెటర్లను ఉపసంహరించుకోలేదని యాజమాన్యం తెలిపింది. అయితే జాయినింగ్ తేదీలను పొడిగిస్తున్నట్లు కంపెనీలు తెలిపినట్లు వెల్లడించింది. ఇక ఐఐటీ బాంబే కూడా జూలై వరకు ప్లేస్మెంట్లను పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇక ఐఐటీ గాంధీనగర్లో 25శాతం మంది విద్యార్థులు ఆఫర్లెటర్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఆయా కంపెనీలతో టచ్లో ఉండి మాట్లాడుతున్నట్లు ఐఐటీ గాంధీనగర్ తెలిపింది.