బతికి సాధిస్తా: 19వ రోజున దీక్ష విరమించిన హార్ధిక్ పటేల్
అహ్మదాబాద్ : పటీదార్ అమానత్ ఆందోళన్ సమితి అధ్యక్షుడు హార్దిక్ పటేల్ గత కొద్దిరోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను బుధవారం విరమించారు. కోధల్ధామ్ ట్రస్ట్ ఛైర్మెన్ నరేష్ పటేల్, ఇతర పటీదార్ ట్రస్టీల సమక్షంలో ఆయన దీక్ష విరమించారు. 19 రోజుల తర్వాత హార్ధిక్ పటేల్ తన దీక్షను విరమించాడు. బతికి ఉండి సాధించుకుందామని ప్రభుత్వంపై పోరాడుదామని తమ సామాజిక వర్గంవారు చెప్పడంతో తాను దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించాడు హార్ధిక్ పటేల్. తాను దీక్ష విరమిస్తున్నట్లు అధికార ట్విటర్పై హార్దిక్ పోస్ట్ చేశారు.
క్షీణించిన హార్దిక్ పటేల్ ఆరోగ్యం: ఆస్పత్రికి తరలింపు
హార్దిక్ పటేల్ దీక్ష చేస్తున్న 16వ రోజున తన నివాసం దగ్గర పోలీసులకు జర్నలిస్టులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. హార్దిక్ పటేల్ మీడియా సమావేశం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న జర్నలిస్టులు అతని నివాసం దగ్గరకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు జర్నలిస్టులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీక్ష 14వ రోజున హార్దిక్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో తప్పని పరిస్థితుల్లో SGVP హాస్పిటల్కు పోలీసులు తరలించారు. దీక్ష 15వ రోజున హార్దిక్ పటేల్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. తనను ప్రేమించేవారి కోసం తాను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమేకాని.. తనను చంపాలనుకునే వారికోసం తాను మరణించబోనని గట్టి సంకేతాలు ప్రభుత్వానికి పంపాడు.
పటీదార్లకు విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలన్న డిమాండ్తో ఆగష్టు 25 హార్దిక్ పటేల్ ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నారు. ఈ క్రమంలోనే తన దీక్షకు చాలా మంది రాజకీయ ప్రముఖులు పార్టీలు మద్దతు తెలిపాయి. ప్రకాష్ అంబేడ్కర్, హరీష్ రావత్, శరద్ యాదవ్, ఏ రాజా, యశ్వంత్ సిన్హా, శతృఘ్నసిన్హాలాంటి ప్రముఖులు హార్దిక్ నివాసానికి చేరుకుని మద్దతు తెలిపారు.