గుజరాత్లో ఇక ‘సెగ’లే: శివసేన వర్సెస్ మోదీ.. మధ్యలో హార్దిక్
పటేళ్లకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆందోళన బాట పట్టిన హార్దిక్ పటేల్.. 2014లో కేంద్రంలో బిజెపి అదికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇబ్బంది పడుతున్న దాని మిత్రపక్షం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే
ముంబై: పటేళ్లకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆందోళన బాట పట్టిన హార్దిక్ పటేల్.. 2014లో కేంద్రంలో బిజెపి అదికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇబ్బంది పడుతున్న దాని మిత్రపక్షం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ఒక్కటయ్యారు. గుజరాత్లో ప్రధాని మోడీకి, బీజేపీకి చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు.
లోక్సభలో బిజెపికి మెజారిటీ ఉన్నందున నరేంద్రమోడీ ప్రభుత్వానికి ముప్పు లేదు. కానీ మహారాష్ట్రలో మాత్రం శివసేన మద్దతు తప్సనిసరి కావాలి. కనుక మహారాష్ట్ర ముంగిట రాజకీయ అనిశ్చితి తలెత్తుతుందా? లేదా? అన్న సంగతి ఇప్పటికిప్పుడు తేలదు. త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకుంటామని సంకేతాలిచ్చారు. కాగా త్వరలో జరిగే బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీతో విభేదించిన శివసేన, రాజ్ థాకరే సారథ్యంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేనతో కలిసి పోటీ చేస్తున్నది.
ఈ దశలోనే పాటిదార్ల రిజర్వేషన్ ఆందోళనతో దేశమంతా హోరెత్తించి గుజరాత్లో అధికార బీజేపీకి కంటిలో నలుసులా మారిన హార్దిక్ పటేల్తో ఉద్ధవ్ థాకరే వ్యూహాత్మకంగా చేతులు కలిపారు. ముంబైలో నివసిస్తున్న గుజరాతీలను తన వైపునకు తిప్పుకునేందుకు ఎత్తువేశారు. అందులో భాగంగానే అవసరమైతే ఈ ఏడాది చివరిలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన తరఫున బీజేపీకి వ్యతిరేకంగా హార్దిక్ పటేల్ ప్రచారం చేస్తారని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్థాకరే ప్రకటించారు.
రెండు రోజుల క్రితం ముంబైకి వచ్చిన హార్దిక్ పటేల్ మంగళవారం ఉదయం బంద్రాలోని ఉద్ధవ్తో ఆయన నివాసం మాతృ శ్రీలో సమావేశం అయ్యారు. భేటీ తర్వాత ఇద్దరు నేతలూ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. తమ స్నేహం సుదీర్ఘ కాలం కొనసాగుతుందని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హార్దిక్.. శివసేన తరఫున ప్రచారం నిర్వహిస్తారని చెప్పారు. ఎంతోకాలంగా హార్ధిక్ పటేల్.. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరేకు నివాళులర్పించాలని భావిస్తున్నారని, అందుకే ఆయన తమ నివాసానికి వచ్చారని అన్నారు. శివసేన, హార్దిక్ న్యాయం కోసం ఉమ్మడి పోరాటం చేస్తాయని ఉద్ధవ్ తెలిపారు.
పటేళ్లకు రిజర్వేషన్ కోసమే తన పోరాటం
సమాజంలో వచ్చిన మార్పుకు అనుగుణంగా ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ పాటిదార్లకు ఓబీసీ రిజర్వేషన్ల కోసం తమ ఆందోళన కొనసాగుతుందని హార్దిక్ పటేల్ అన్నారు. ఈ విషయమై ముంబైలో పాటిదార్లతో చర్చించేందుకే తాను వచ్చానని తెలిపారు. తాను ఎల్లవేళలా బాబా సాహెబ్ బాల్ థాకరే సిద్ధాంతాలతో స్ఫూర్తి పొందానన్నారు. గుజరాతీ, మరాఠీలు తనకు స్నేహితులని అన్నారు.
మంచి వారితో సత్సంబంధాలు ఉండటం సహజమని, ఇందులో రాజకీయాలు జోడించొద్దని సూచించారు. అయితే గుజరాత్ రాష్ట్రంలో శివసేన తరఫున తన ప్రచారం గురించి తాము చర్చించలేదన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాను శివసేన పార్టీకి సారథ్యం వహిస్తానని ఉద్ధవ్ చెప్పారన్నారు. కానీ తాను రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తానని చెప్పారు. థాకరే కుటుంబ సభ్యులతో తనకు సంబంధాలు ఉన్నాయని, అందుకే మాత్రుశ్రీకి వచ్చానని హార్దిక్ చెప్పారు.
భయంలేని సమాజం కోసం ఆందోళన
తన వయస్సు 22 ఏళ్లు మాత్రమేనని, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను అనర్హుడినని పేర్కొన్నారు. కనుక తన ఏకైక లక్ష్యం పాటిదార్లకు ఓబీసీ రిజర్వేషన్లు సాధించడమేనని స్పష్టం చేశారు. బాల్ థాకరే, ఉద్ధవ్ థాకరే ఆశీస్సులు పొందడానికే ఇక్కడికి వచ్చానని తెలిపారు. మహాత్మా ఫూలే, వీర్ సావర్కర్, ఛత్రపతి శివాజీ, అంబేద్కర్ పుట్టిన గడ్డపై అడుగు పెట్టినందుకు గర్వంగా ఉన్నదన్నారు.
గుజరాత్ రాష్ట్రంలో భయంలేని సమాజంతో కూడిన ప్రభుత్వం ఏర్పాటు కోసం పోరాడుతున్నానని చెప్పారు. తనపై గుజరాత్ ప్రభుత్వం రెండు దేశ ద్రోహ నేరం కేసులో మోపిందని గుర్తు చేశారు. ముంబై మున్సిపల్ ఎన్నికల్లో తాను ప్రత్యక్షంగా ప్రచారం చేయబోనని, తన వాళ్లు శివసేనకు మద్దతు ఇస్తారని హార్దిక్ పటేల్ తెలిపారు. గుజరాతీలు తప్పనిసరిగా శివసేనకే అనుకూలంగా ఉంటార్నారు.
వ్యూహాత్మకంగా ఉద్ధవ్ ఎత్తులు
2014 ఎన్నికల నుంచి శివసేన, బీజేపీ మిత్రపక్షాలైనా మాటల యుద్ధం సాగుతూనే ఉన్నది. తాజాగా బీఎంసీ ఎన్నికల్లో శివసేన సంప్రదాయ ఓటుబ్యాంకు మరాఠీలను తనవైపునకు తిప్పుకునేందుకు బీజేపీ దూకుడుగా ముందుకెళ్తున్నది. ఈ పరిణామాన్ని రుచించని శివసేన.. ప్రత్యామ్నాయ వ్యూహం రూపొందించింది. బీజేపీ ఆశలు పెట్టుకున్న గుజరాతీ ఓటుబ్యాంకు కొల్లగొట్టేందుకు.. ముంబైకి వచ్చిన హార్దిక్ పటేల్ను అందుకు అనుగుణంగా రంగంలోకి దించింది.
సబర్బన్ డివిజన్లు బోరివ్లీ - కాందివ్లీ, మాలాడ్, ఘాట్కోపర్, ములుంద్ ప్రాంతాల్లోని 20 డివిజన్ల పరిధిలో విజయావకాశాలను ప్రభావితం చేయగల స్థాయిలో గుజరాతీలు ఎక్కువగా ఉన్నారు. నోట్ల రద్దు తర్వాత వ్యాపార వర్గాలు ఎదుర్కొన్న ఇబ్బందులను తనకు అనువుగా మార్చుకోవాలని ఉద్ధవ్ థాకరే బావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే పలువురు గుజరాతీలకు కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు బీ ఫామ్ లు ఇచ్చారు. ఇటీవలే బిజెపి నుంచి శివసేనలో చేరిన మంగల్ భానుషాలీకి ములుంద్ స్థానం టిక్కెట్ ఇచ్చింది. గుజరాతీలకు నిలయమైన ఈ డివిజన్ బిజెపికి ఒకప్పుడు కంచుకోట. జ్యువెలర్ పరేష్ సోనీ కూడా శివసేన తరఫున బోరివ్లీ (డబ్ల్యూ) స్థానంలో బరిలో నిలిచారు.
ముంబైలో గుజరాతీలు 18 శాతం
హార్ధిక్ పటేల్తో ఉద్ధవ్ థాకరే గత నెల 19 నుంచి సంప్రదింపులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. 2014 లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో బిజెపి గణనీయ విజయాలు సాధించింది. ముంబైలోని ఓటర్లలో గుజరాతీల వాటా 18 శాతం. మరాఠాల రిజర్వేషన్ ఆందోళనకు తాను మద్దతునిస్తు్నట్లు తెలిపారు. పాటిదార్లు, మరాఠీలు తప్పనిసరిగా రిజర్వేషన్లు పొందాల్సిందేనన్నారు.