పటేల్ రిజర్వేషన్ల గళం.. ఇక లోక్ సభలో: హార్ధిక్ పటేల్ కు కాంగ్రెస్ గాలం
గుజరాత్ లో మెజారిటీ సంఖ్యలో ఉన్న పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న హార్ధిక్ పటేల్.. రాజకీయ రంగ ప్రవేశం ఖాయమైంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటూ జరిగితే.. ఆయన తన సొంత జిల్లా జామ్ నగర్ స్థానం నుంచి లోక్ సభకు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 12వ తేదీన ఆయన కాంగ్రెస్ లో చేరవచ్చని తెలుస్తోంది.
గుజరాత్ లో పటేల్ సామాజిక వర్గ ప్రజలు అగ్రవర్ణాలుగా కొనసాగుతున్నారు. వారికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నాలుగేళ్లుగా హార్ధిక్ పటేల్ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికోసం ఆయన ప్రత్యేకంగా పాటిదార్ అనామత్ ఆందోళన్ కమిటీని ఏర్పాటు చేశారు. గుజరాత్ లో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ఆందోళనలను చేపట్టారు. ఇన్నేళ్లుగా ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ.. ఏ పార్టీలోనూ చేరలేదు.
తాజాగా- వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం జాతీయ రాజకీయ పార్టీ అండ కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి, ఆ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జామ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ చేతిలో ఉంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోట చేసిన పూనమ్ బెన్ మేడమ్.. ఇక్కడి నుంచి గెలుపొందారు. ఈ సారి జామ్ నగర్ లోక్ సభ స్థానాన్ని క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు కేటాయించాలని బీజేపీ యోచిస్తోంది.