గుజరాత్ ఎఫెక్ట్: బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్ మాజీ స్నేహితుడు, దేశద్రోహం కేసులో జైలు !
గుజరాత్ రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ కు కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది.
అహ్మదాబాద్: గుజరాత్ రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ కు కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది. గుజరాత్ లోని పటీదార్ వర్గానికి చెందిన యువ నాయకుడు, హార్దిక్ పటేల్ కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ తరువాత అతనికి దూరం అయిన చిరాక్ పటేల్ కు బీజేపీ గాలం వేసింది.
గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ సమక్షంలో చిరాక్ పటేల్ అధికారికంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడిన చిరాక్ పటేల్ తన మాజీ స్నేహితుడు హార్దిక్ పటేల్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పటీదార్లుకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తాము పెద్ద ఎత్తున పోరాటం చేశామని గుర్తు చేశారు. తరువాత ఉద్యమంలో పాల్గొనే నెపంతో హార్దిక్ పటేల్ సొంత లాభాల మీద ఆసక్తి పెంచుకున్నాడని చిరాక్ పటేల్ ఆరోపించారు. తనకు పేరు ప్రతిష్టలు పెరగాలని, ఆర్థికంగా అభివృద్ది కావాలని హార్దిక్ పటేల్ ప్రయత్నించాడని విమర్శించారు.
పటీదార్ ఉద్యమాన్ని హార్దిక్ పటేల్ నాశనం చేశాడని చిరాక్ పటేల్ ఆరోపించారు. త్వరలోనే హార్దిక్ పటేల్ నిజస్వరూపం పటీదార్ వర్గానికి తెలుస్తోందని చిరాక్ పటేల్ జోస్యం చెప్పాడు. చిరాక్ పటేల్ మీద ఆరోపణలు రావడంతో గత సంవత్సరం ఆయన్ను పటీదార్ ఉద్యమ కమిటీ నుంచి బహిష్కరించారు.
హార్దిక్ పటేల్ తో పాటు చిరాక్ పటేల్ దేశద్రోహం కేసులో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లాడు. ఈ కేసులో ఇంకా చిరాక్ పటేల్ మీద విచారణ కొనసాగుతోంది. హార్దిక్ పటేల్, చిరాక్ పటేల్ మధ్య మనస్పర్థలు రావడం, ఇద్దరూ వేర్వేరుగా రాజకీయాలు చెయ్యడం మొదలు కావడంతో ఒరికోకరు దూరం అయ్యారు.