హార్ధిక్ పటేల్ వెనుక విదేశీ హస్తం: కస్టడి పొడగింపు
అహమ్మదాబాద్: పటేల్ రిజర్వేషన్ల కోసం గుజరాత్ లో తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న హార్ధిక్ పటేల్ పోలీసు కస్టడీని మరో రెండు రోజులు పోడగిస్తున్నామని అహ్మదాబాద్ కోర్టు తెలిపింది. హై కోర్టు ఆదేశాల మేరకు హార్ధిక్ పటేల్ నవంబర్ మూడవ తేది వరకు పోలీసు కస్టడిలో ఉండనున్నారు.
హార్ధిక్ పటేల్ నుంచి మరిన్ని వివరాలు సేకరించడానికి తమకు వారం రోజుల గడువు ఇవ్వాలని క్రైం బ్రాంచ్ పోలీసులు హై కోర్టులో మనవి చేశారు. హార్దిక్ పటేల్ తమ విచారణకు సహకరించడం లేదని క్రైం బ్రాంచ్ పోలీసులు కోర్టులో చెప్పారు.
మొత్తం 452 గ్రూప్ ల వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వార పటేల్ ఉద్యమాన్ని వ్యాప్తి చేస్తున్నారని విచారణలో వెలుగు చూసిందని కోర్టులో తెలిపారు. ఆగస్టు 25వ తేదిన నిర్వహించిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలకు భంగం కలిగించాలని ఈయన పిలుపినిచ్చారని పోలీసులు ఆరోపించారు.
అంతే కాకుండా తమ ఉద్యమాన్ని ఆందోళనల ద్వార రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చెయ్యాలని యువతను రెచ్చగొడుతున్నాడని క్రైం బ్రాంచ్ పోలీసులు కోర్టులో చెప్పారు. హార్ధిక్ పటేల్ ను విచారణ చెయ్యడానికి వీలు కల్పించాలని మనవి చేశారు.
పటేల్ ఉద్యమం వెనుక విదేశీ హస్తం ఉందని, వీరి ఉద్యమానికి విదేశాల నుంచి నిధులు సమకూరుతున్నాయనే అనుమానం ఉందని, అందుకు అత్యవసరంగా విచారణ చెయ్యవలసిన అవసరం చాల ఉందని క్రైం బ్రాంచ్ పోలీసులు కోర్టులో వివరించారు.
కేసు వివరాలు తెలుసుకున్న న్యాయస్థానం హార్ధిక్ పటేల్ ను విచారించడానికి రెండు రోజులు మాత్రం గడువు ఇచ్చింది. దేశద్రోహం, సమాజంలో అలజడులు సృష్టించడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ గతంలో సూరత్ పోలీసు హార్దిక్ పటేల్ ను అరెస్టు చేశారు.
దేశద్రోహానికి పాల్పడ్డారని ఆధారాలు ఉన్నాయని పోలీసులు గుజరాత్ హై కోర్టులో తెలిపారు. తన మీద నమోదు అయిన కేసు కొట్టి వేయాలని హార్ధిక్ పటేల్ హై కోర్టును ఆశ్రయించారు. అయితే హార్ధిక్ పలేట్ మీద నమోదు అయిన కేసులకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని కేసు కొట్టిసేది లేదని గుజరాత్ హై కోర్టు ఇప్పటికే తేల్చి చెప్పింది.