తుపాకీ పెట్టి..చంపుతామని బెదిరించారు: హార్దిక్ పటేల్
గాంధీనగర్: పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఆందోళన చేపట్టిన హార్ధిక్ పటేల్ అదృశ్యంపై బుధవారం కొంతసేపు హైడ్రామా కొనసాగింది. గుజరాత్లోని ఆరావళి జిల్లాలోని బయద్ తాలుకాలో హార్ధిక్ పటేల్ మంగళవారం బహిరంగ సభ నిర్వహించారు. దీనికి పోలీసుల అనుమతి తీసుకోకపోవడంతో.. అరెస్టు చేసేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు.
కాగా, పోలీసులకు చిక్కకుండా హార్ధిక్ అక్కడికినుంచి తప్పించుకున్నాడు. అయితే, ఆ తర్వాత అతడు అదృశ్యమయ్యాడు. హార్ధిక్ ఆచూకీ తెలియకపోవడంతో అతడి సహాయకుడు దినేష్ పటేల్ రాత్రి 1.20గంటలకు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ పిటిషన్పై బుధవారం తెల్లవారుజామున 2.40గంటల వరకు విచారణ చేపట్టింది.
గురువారం కోర్టు ప్రారంభయ్యే సమయానికి అతడిని హాజరుపర్చాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. అయితే, అనూహ్యంగా పోలీసులు అతడిని బుధవారం ఉదయమే హైకోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా హార్ధిక్ మీడియాతో మాట్లాడుతూ.. బయద్ నుంచి బయల్దేరిన తనను జాతీయ రహదారిపై కొందరు అడ్డగించారని, తనను బలవంతంగా వారి కారులో తీసుకెళ్లారని చెప్పారు.
వారు పోలీసులో మరెవరో తనకు తెలియదన్నారు. కానీ, ఉద్యమం ఆపకపోతే చంపేస్తామని.. ఇదే మొదటి, చివరి హెచ్చరిక అని బెదిరించారని చెప్పారు. కిడ్నాప్ చేసిన వ్యక్తుల్లో ఒకరి వద్ద రివాల్వర్ ఉందని తెలిపారు.
రాత్రి అంతా తనను కారులోనే తిప్పి, ఉదయం సురేంద్రనగర్ తాలూకాలోని ధ్రంగ్ధర గ్రామంలో వదిలేసినట్లు చెప్పారు. ఈ విషయంపై గాంధీనగర్ రేంజ్ ఐజీ హస్ముఖ్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ.. హార్ధిక్ను పోలీసులు కిడ్నాప్ చేయలేదన్నారు.
ఇది ఇలా ఉండగా, పటేల్ ఆందోళనలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ఓబీసీ ఏక్తామంచ్ రాష్ట్ర కన్వీనర్ అల్పేష్ఠాకూర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. మెహసనా జిల్లాలో అనుమతి లేకుండా సభ నిర్వహించినందుకు అల్పేష్ మరో 38మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.