క్షీణిస్తున్న హార్ధిక్ పటేల్ ఆరోగ్యం...రాజకీయ పార్టీలనుంచి పెరుగుతున్న మద్దతు
అహ్మదాబాద్ : పటీదార్ ఆందోళన్ సమితి నేత హార్దిక్ పటేల్ ఆమరణనిరాహార దీక్ష 11వ రోజుకు చేరింది. హార్ధిక పటేల్ ఆరోగ్యం క్షీణించింది. పటేళ్లుకు ఉద్యోగాల్లో, అడ్మిషన్స్లో రిజర్వేషన్ కల్పించాలంటా తన నివాసంలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నాడు. హార్ధిక్ పటేల్కు రోజురోజుకూ మద్దతు పెరిగిపోతోంది.దీంతో గుజరాత్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. డాక్టర్లు చెప్పే సూచనలను విని హార్దిక్ పటేల్ వైద్యానికి సహకరించాలని తెలిపింది. హార్దిక్ పటేల్ ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూనే అదే సమయంలో ఆయన దీక్ష వెనక కాంగ్రెస్ హస్తం ఉందని ఆరోపించింది.
"హార్ధిక్ పటేల్ ఆరోగ్యంపై గుజరాత్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. హార్దిక్ పరిస్థితిని సమీక్షించేందుకు వైద్యులను ఏర్పాటు చేశాం. ఐసీయూని ఏర్పాటు చేశాం. ఇంటి బయట అంబులెన్స్ను సిద్ధంగా ఉంచాం. అయితే తను డాక్టర్ల సలహాలను పాటించాలని వైద్యానికి సహకరించాలని కోరుతున్నాం"అని ఆ రాష్ట్ర మంత్రి సౌరభ్ పటేల్ అన్నారు. ఈ సందర్భంగా రైతుల కోసం తమ ప్రభుత్వం చేస్తున్న పనులను గురించి మంత్రి వివరించారు. అయితే హార్ధిక్ పటేల్కు రోజు రోజుకు రాజకీయ పార్టీలనుంచి మద్దతు పెరుగుతుండటంతో గుజరాత్ ప్రభుత్వంలో కలవరం మొదలైంది.
ఇప్పటికే హార్దిక్ను పలువురు రాజకీయనాయకులు పరామర్శించారు. పటేళ్లకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్ను గుజరాత్ ప్రభుత్వం నెరవేర్చాలని పార్టీలు అన్నాయి. ఇందులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, మాజీ ప్రధాని దేవెగౌడలు కూడా మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు,ఎన్సీపీ, ఆర్జేడీ నేతలు హార్దిక్ నివాసానికి వచ్చి ఆయన్ను పరామర్శించారు. ఇదిలా ఉంటే పటీదార్ రిజర్వేషన్ల ఉద్యమాన్ని కాంగ్రెస్ నడిపించిందని మంత్రి సౌరభ్ ఆరోపించారు. ఈ ఉద్యమంను ఆసరాగా తీసుకుని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేసిందని ఆరోపించారు.
ఇదిలా ఉంటే...రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పటేల్ సామాజిక వర్గం వారు అహ్మదాబాద్కు వస్తుండటంతో పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు.