సరస్వతీ పుత్రుడు: పేదరికం వెక్కిరించినా...ఎయిమ్స్లో సీటు సాధించాడు
ఉత్తర్ ప్రదేశ్: ఆ అబ్బాయిని పేదరికం వెక్కరించింది..అయినా సరస్వతీ తల్లి అక్కున చేర్చుకుంది. ఆ కటిక పేదరికాన్ని జయించి ఇప్పడు ప్రఖ్యాత ఎయిమ్స్ వైపు తన అడుగులు వేయబోతున్నాడు. ఇంతకీ ఎవరా సరస్వతీ పుత్రుడు అనుకుంటున్నారా... ఆయనే ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ఆశ్రమ్ చౌదరి.
ఆశ్రమ్ చౌదరి అనే ఈ కుర్రాడికి చదువంటే ప్రాణం. అయితే చిన్నప్పటి నుంచి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో చదవు ఆగిపోతోందేమో అన్న భయం కూడా ఆ బాలుడిని వెంటాడింది. తల్లి దండ్రులు ఇద్దరూ రోజూవారి కూలీలు. రెక్కాడితే కానీ.. డొక్కాడని పరిస్థితి వారిది. ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో రాత్రులు పస్తులున్నారు. అయినా సరే చదువుకొని తన కుటుంబ స్థితిగతులను మార్చాలనే పట్టుదల ఆశ్రమ్ను బడివైపే అడుగులు వేయించింది. తండ్రి చెత్తను ఏరి వాటిని అమ్మి వచ్చిన డబ్బులతో ఎలాగోలా కొడుకును చదివించాడు.
కష్టంతోనే కాదు ఇష్టంగా కూడా చదివి ఆశ్రమ్ ఒక్కో తరగతి పాస్ అయ్యాడు. చివరికి జోధ్పూర్లోని ప్రఖ్యాత ఎయిమ్స్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సంపాదించాడు. తను కన్న కలలను సాకారం చేసుకోబోతున్నాడు. అయితే ఇక్కడ కూడా షరామామూలే... మళ్లీ ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని పలకరిస్తున్నాయి. ప్రఖ్యాత మెడికల్ కాలేజీలో సీటు వచ్చిందన్న సంతోషంకంటే... ఆర్థిక ఇబ్బందులే వారిని మరింత కుదిపేస్తున్నాయి. ఆశ్రమ్ చదువును కొనసాగించాలంటే తమదగ్గర అంత డబ్బులేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తండ్రి రంజిత్ చౌదరి.
తనకు ప్రముఖ ఎయిమ్స్ కళాశాలలో సీటు రావడం చాలా సంతోషంగా ఉందన్నాడు ఆశ్రమ్. ఆ గ్రామంలో పనిచేసే ఒక డాక్టర్ తనకు ఆదర్శమన్నాడు. రోజూవారీ కూలీ చేసుకుంటూ తనను చదివించేందుకు తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారని గుర్తుచేసుకున్నాడు ఆశ్రమ్. ముందుగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత నవోదయ విద్యాలయ సిబ్బందికి, ఆర్థికంగా అండగా నిలిచిన దక్షిణ ఫౌండేషన్కు ధన్యవాదాలు చెప్పాడు ఆశ్రమ్. డాక్టర్ అయ్యాక తన గ్రామంలోనే సేవ చేస్తానని ఆశ్రమ్ సంతోషంగా చెప్పాడు.