జయ పిటిషన్: రాం జెఠ్మలానీ ప్లేసులో హరీష్ సాల్వే
న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో బెంగుళూరు జైల్లో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తరుపు న్యాయవాదులు గురువారం ఢిల్లీ చేరుకుని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. కర్ణాటక హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంపై వారు ఈ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమచారం.
సుప్రీంకోర్టులో తన బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించే న్యాయవాదులను జయలలిత మార్చినట్లు సమాచారం. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే సమయంలో హరీష్ సాల్వేతో వాదనలు వినిపించాల్సిందిగా ఆమె చెప్పినట్లు తెలుస్తుంది.
జయలలిత తరుపున కర్ణాటక హైకోర్టులో ప్రముఖ న్యాయవాది రాం జెత్మలానీ వాదనలు వినిపించినా బెయిల్ రాలేదు. రాంజెఠ్మలానీ నిర్లక్ష్యం వల్లే, కర్ణాటక హైకోర్టులో తనకు బెయిల్ రాలేదని జయ భావిస్తున్నారట.
దీంతో సుప్రీం కోర్టులో తన బెయిల్ పై హరీశ్ సాల్వే వాదనలు వినిపించేలా చూడాలని తన అనునచరులకు ఆమె ఆదేశాలు జారీ చేశారట. దీంతో రాంజెఠ్మలానీ స్థానంలో ఇకపై హరీశ్ సాల్వే, జయలలిత న్యాయవాదిగా కొనసాగనున్నారు.
సుప్రీంకోర్టుకు ఈ నెల 18 నుంచి 26 వరకు దీపావళి సెలవులు. దీంతో 18 లోపల జయ అప్పీల్ను సుప్రీం కోర్టు విచారణకు తీసుకోకపోతే దీపావళి పండుగనాడు కూడా జయలలిత జైల్లోనే గడపాల్సి ఉంటుంది.