ప్రధాని పేపర్లూ చించేస్తారు:రాహుల్పై హర్సిమ్రాత్ ఫైర్
న్యూఢిల్లీ: లలిత్ గేట్, వ్యాపం కుంభకోణం అనంతరం బిజెపి నేతలు, కేంద్రమంత్రులు కాంగ్రెస్ పార్టీ పైన ఎదురు దాడికి దిగుతున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన కేంద్రమంత్రి హర్సిమ్రాత్ కౌర్ బాదల్ మంగళవారం మండిపడ్డారు.
అమేథీలో ప్రతిపాదిత ఫుడ్ పార్క్ రద్దు విషయమై రాహుల్ గాంధీ పైన.. హర్సిమ్రాత్ కౌర్ బాదల్ కౌంటర్ ఇచ్చారు. యూపీలో ఆహార పార్కుల ఏర్పాటుకు సంబంధించిన ప్రశఅనకు లోకసభలో మంగళవారం సమాధానమిచ్చారు.
ఆమె మాట్లాడుతూ... అమేథీ నియోజకవర్గం గురించి అందరీకీ తెలుసునని, అక్కడి ఎంపీ... ప్రధానమంత్రికి చెందిన పేపర్లను కూడా చింపివేయగల శక్తి కలవారని ఎద్దేవా చేశారు.
కానీ ఆహార పార్కు ఏర్పాటుకు కావాల్సిన భూమిని మాత్రం ఆయన ఇప్పటి వరకు సర్దుబాటు చేయలేకపోయారని రాహుల్ గాంధీ పేరు చెప్పకుండా ఆయనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
దోషులుగా తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ సుప్రీం ఆదేశాలు వెలువరించగా.. సదరు ఆదేశాలను తిరస్కరించేందుకు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ విడుదల చేసిన ఆర్డినెన్సు పేపర్లను రాహుల్ బహిరంగంగా చింపివేసిన ఘటన అందరికీ తెలిసిందే.
సమయం ఇవ్వడం లేదు: సుష్మా స్వరాజ్
బుధవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోకసభ మొదలైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు ఆందోళన ప్రారంభించారు. స్పీకర్ పోడియంలోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ లలిత్ మోడీ అంశంలో సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలంటూ పట్టుబట్టారు.
అయితే లలిత్ విషయంలో తాను మరోసారి వివరణ ఇచ్చేందుకు సిద్ధమని సుష్మా స్వారాజ్ తెలిపారు. ఈ క్రమంలో స్పీకర్ సుమిత్ర మహాజన్ ఎంత వారించిన వినకుండా కాంగ్రెస్ సభ్యులు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.
ప్రశ్నోత్తరాల సమయం రద్దు చేయాలని, తమ వాయిదా తీర్మానాలపై చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాల పైన చర్చకు తాను సిద్ధమని సభాపతి చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నోత్తరాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.
మరోవైపు, రాజ్యసభలో కూడా ఇదే తీరు కొనసాగింది. కాంగ్రెస్ సభ్యులు పోడియంలోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.