కేంద్ర మంత్రి పదవికి కౌర్ రాజీనామా - అకాలీదళ్ సంచలనం - వ్యవసాయ బిల్లులపై బీజేపీకి భారీ షాక్
వ్యవసాయ రంగంలో సంస్కరణలు అంటూ ఇటీవల తీసుకొచ్చిన నిత్యావసర సరుకుల సవరణ బిల్లుల విషయంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మూడు బిల్లులను తొలినుంచీ వ్యతిరేకిస్తోన్న ఎన్డీయే ప్రధాన మిత్రపక్షం శిరోమణీ అకాలిదళ్ గురువారం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. మోదీ కేబినెట్ లో ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ తన పదవికి రాజీనామా చేశారు. అకాలిదళ్ సుక్ బీర్ సింగ్ బాదల్ ఈ మేరకు ప్రకటన చేసిన కొద్ది సేపటికే తాను రాజీనామా సమర్పించేశానని కౌర్ ట్వీట్ చేశారు.
హైదరాబాద్: అతి భారీ హెచ్చరిక - అప్రమత్తంగా ఉండాలన్న లోకేశ్ - మూసీ ఒడ్డున మొసళ్ల కలకలం
లోక్ సభ సాక్షిగా ప్రకటన..
వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు బిల్లులను కేంద్రం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టగా.. ఎన్డీఏ కూటమిలోని శిరోమణి అకాలీదళ్ సహా విపక్షాలు, రైతు సంఘాలు వ్యతిరేకించాయి. రైతుకు తీరని నష్టం చేసే ఈ బిల్లుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతుననాయి. ఒడిశా, తెలంగాణ లాంటి రాష్ట్రాలు సైతం ఈ బిల్లులపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. అయినాసరే, బీజేపీకి మెజార్టీ ఉండటంతో మూడు బిల్లుల్లో ఒకదానికి మంగళవారం లోక్ సభలో ఆమోదం లభించింది. మిగతా రెండు బిల్లులపై గురువారం చర్చ సందర్భంగా.. అకాలీ చీఫ్ సుక్ బీర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తీరుకు నిరసనగా తమ పార్టీకి చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తారని ప్రకటించారు.
చైనాతో టెన్షన్: తెరపైకి కొత్త అంశం -పెట్రోలింగ్పై ఆంటోనీ ప్రశ్నలు - వివరాలు చెప్పలేనన్న రక్షణమంత్రి
అందుకే రాజీనామా..
‘‘రైతు వ్యతిరేక బిల్లులకు నిరసనగా నేను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశాను. రైతు బిడ్డగా, రైతన్నకు చెల్లెలిగా వాళ్ల తరఫున నిలబడటం గర్వంగా ఉంది'' అని కౌర్ ట్వీట్ చేశారు. లోక్ సభలో సుక్ బీర్ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి సంబంధించి దేశంలోనే పంజాబ్ అగ్రశ్రేణి రాష్ట్రంగా కొనసాగుతున్నది, గడిచిన 50 ఏళ్లుగా అక్కడి ప్రభుత్వాలు, రైతులు కలిసి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థతోనే అది సాధ్యమైందని, కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన బిల్లులతో రైతులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. ‘‘పంజాబ్ రైతుల 50 ఏళ్ల కృషిని ఈ బిల్లు నిమిషంలో నాశనం చేస్తుంది. ఆహార ధాన్యం ఉత్పత్తిలో దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడంలో పంజాబ్ పాత్రను ఎవరూ మర్చిపోలేరు'' అని సుక్ బీర్ వ్యాఖ్యానించారు. కాగా, పార్టీ పరంగా వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకిస్తోన్న హర్సిమ్రత్ కౌర్ బాదల్.. కేంద్ర మంత్రి పదవిలో ఉండి సదరు బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయలేని పరిస్థితి నెలకొంది కాబట్టే, తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రి పదవికి రాజీనామా చేసి, ఎంపీగా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తారని అకాలీదళ్ వర్గాలు తెలిపాయి. కాగా,
ఆ మూడు బిల్లులు ఇవే..
వ్యవసాయ రంగంలో సంస్కరణలు అంటూ కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులు.. నిజానికి ఆర్డినెన్స్ రూపంలో గతం నుంచే అమలులో ఉన్నా పెద్దగా పట్టింపు లేకపోయేది. ఇప్పుడవి చట్టాలుగా మారితే రైతులకు తిప్పలు తప్పవని విపక్షాలు అంటున్నారు. ఆ మూడు బిల్లులు ఏవంటే, 1.రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు, 2.రైతుల (సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు, 3. నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లు.
అకాలీదళ్, రైతుల వాదన ఇది..
కొత్తగా రూపొందించిన బిల్లుల ద్వారా రైతులు తమ పంటల్ని మార్కెట్ యార్డుల్లోనే విక్రయించాలన్న నిబంధన తొలగిపోయి, ఎక్కడైనా అమ్ముకునే వీలు ఏర్పడుతుందని కేంద్రం చెబుతున్నది. అంతేకాదు, రైతుల ధరల హామీ, సేవల ఒప్పందం ప్రకారం పంటలు వేయడానికి ముందే వ్యాపారస్తులతో రైతులు చేసుకునే ఒప్పందాలకు చట్టబద్ధత వస్తుంది. చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు వంటి ఆహార ఉత్పత్తుల నిల్వలపై ఆంక్షలు తొలగిపోవడం మరో కీలక అంశం. అయితే ఈ విధానాలేవీ రైతులకు మేలు చేయబోవని, వ్యవసాయ రంగాన్ని దళారీలు, బడా వ్యాపారుల చేతుల్లోకి బదలాయించే ఎత్తుగడ ఇదని అకాలీదళ్, విపక్షాలు, రైతు సంఘాలు వాదిస్తున్నాయి. మండీ వ్యవస్థను కొనసాగించాలని, రుణాలు మాఫీచేసి, స్వామినాథన్ సిఫార్స్ల మేరకు కనీస మద్దతు ధర కచ్చితంగా అమలు చేయాలని పట్టుపడుతున్నాయి.