పాశవిక గ్యాంగ్ రేప్, హత్య: ఏడుగురికి మరణశిక్ష
రోహతక్: నేపాల్కు చెందిన 28 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన కేసులో ఏడుగురికి హర్యానాలోని రోహతక్ అదనపు సెషన్స్ కోర్టు మరణశిక్ష విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది. ఈ కేసు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
ఈ అత్యాచారం, హత్య ఘటనల్లో పాలు పంచుకున్న మైనర్పై జువెనైల్ జస్టిస్ బోర్డు విచారణ జరుపుతోంది. మరో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గద్దిఖేరి గ్రామంలో అక్కాబావలతో నివసిస్తున్న నేపాల్కు చెందిన మానసిక వికలాంగురాలిని అదే గ్రామానికి చెందిన 9 మంది ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన అపహరించి, కిరాతకంగా అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసి మృతదేహాన్ని రోహతక్ - హిస్సార్ హైవే పక్కన పొలాల్లో పడేశారు.
మృతదేహంపై, మర్మాయవాలపై దారుణమైన గాయాలున్నట్లు, శరీరంలో రాళ్లూ బ్లేడ్లూ ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలింది. ఈ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన తలెత్తడంతో హర్యానా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. పది నెలల్లోనే దర్యాప్తును, విచారణను ముగించి, తీర్పు ప్రకటించడం గమనార్హం.
నిందితులు రాజేష్, పవన్, ప్రమోద్, బిల్లు, మన్బీర్, మాడా, సునీల్లను గతవారం జిల్లా అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సీమా సింఘాల్ దోషులుగా నిర్ధారించారు. సోమవారంనాడు వారికి వివిధ సెక్షన్ల కింద ఉరిశిక్షతో పాటు జరిమానా విధించారు. ఈ తీర్పును హైకోర్టు ధ్రువీకరించాల్సి ఉంది.
తీర్పును ప్రకటిస్తూ న్యాయమూర్తి ఆసక్తికమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇలాంటి నేరాలు పాల్పడినవారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, వీరికి క్షమాభిక్ష, శిక్ష తగ్గింపు, పెరోల్ తదితర ఊరటలు కలిగించవద్దని అన్నారు. తాను న్యాయమూర్తినే కాదు, మనిషిని కూడా అని, పురుషుల చేతిలో చిత్రహింసలకు గురయ్యే మహిళల ఆక్రందనలు వినగలనని అన్నారు.
మహిళలు బలహీనులు కాదనే సందేశాన్ని సమాజానికి పంపాల్సిన తక్షణావసరం ఉందని, అత్యాచార బాధితులకు నిర్భయ, దామిని లాంటి వేరే పేర్లు అవసరం లేదని, ఇంకెన్ని సార్లు నిర్భయ చనిపోవాలని అన్నారు.