హర్యానా ఎన్నికలు: బీజేపీ తొలి జాబితా రిలీజ్, బబితా ఫోగట్, యోగేశ్వర్దత్లకు టికెట్లు
ఛండీగఢ్: భారతీయ జనతా పార్టీ హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో 78మందితో తన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. సోమవారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్టానం తాజాగా విడుదల చేసింది.
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ నుంచి పోటీకి దిగుతున్నారు. 2014లో ఆయన ఇదే స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కాగా, ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన పలువురు స్టార్ క్రీడాకారులకు కూడా టికెట్లు కేటాయించడం గమనార్హం.
బరోడా నుంచి ఒలింపిక్ పతక విజేత, స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్, దాద్రి స్థానం నుంచి మహిళా రెజ్లర్ బబితా ఫోగట్, షెహువా నుంచి హాకీ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ లను బీజేపీ టికెట్లు ఇచ్చి బరిలో నిలిపింది.
90మంది ఎమ్మెల్యేలున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 21న ఎన్నికలు జరగనున్నాయి. 38మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇవ్వగా.. ఏడుగురికి టికెట్లు నిరాకరించినట్లు బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ వెల్లడించారు.
1st list of BJP candidates for the Assembly elections of Haryana to be held on Oct 21 .. we have given an efficient & honest Govt under the leadership of @mlkhattar for last 5 years .. Its time now to seek the blessings for a better mandate from voters .. @BJP4Haryana pic.twitter.com/o6rq82KIy5
— B L Santhosh (@blsanthosh) September 30, 2019
2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 47 స్థానాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ 15, ఐఎన్ఎల్డీ 19 స్థానాల్లో గెలుపొందాయి. మిగితా స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీనే మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ నేతలు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ కూడా తన ప్రయత్నాలను ముమ్మరంగానే చేస్తోంది.
కాగా, ఇటీవలే బబితా పోగట్, ఆమె తండ్రి మహవీర్ ఫోగట్ భారతీయ జనతా పార్టీలో చేరారు. మరో రెజ్లర్ యోగేశ్వర్ దత్ కూడా ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటంతోనే వీరికి బీజేపీ టికెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ తన తొలి జాబితాలో తొమ్మిదిమంది మహిళలకు ఇద్దరు ముస్లింలకు కూడా స్థానం కల్పించింది.